
ఈత సరదా ప్రాణాలు బలిగొంది
కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో చదువుతున్న అనంతపురం జిల్లా విద్యార్థి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన కురుబన్ అంజన్కుమార్ (20) శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉండేవాడు. బుధవారం 3డే ఫెస్ట్ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అంజన్కుమార్ అనంతరం తన నలుగురు స్నేహితులతో కలసి రేగడిచెలికలోని బావి వద్దకు ఈత కొట్టేందుకని వెళ్లాడు. అంజన్, మరో ఇద్దరు బావిలో ఈతకు దిగారు. ఇద్దరు మాత్రం ఈత రాదంటూ బయటే ఉండిపోయారు. కాసేపటికి ఇద్దరు విద్యార్థులు బయటకు రాగా అంజన్ పైకి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు కళాశాల యాజమాన్యం ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని ఈత తెలిసిన వారితో బావిలో వెతికించారు. సుమారు 40 అడుగుల వరకూ నీళ్లు, అడుగున బురద ఉండటంతో అందులో కూరుకుపోయిన అంజన్ను వెలికి తీసేందుకు వీలు కాలేదు. ఎస్ఐ పి.నరేష్, కళాశాల యాజమాన్యం గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు మృతదేహం కాలికి తాడు కట్టి వెలికి తీశారు. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడ పిల్లల తర్వాత అంజన్ మూడో సంతానమని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.