ఇక చాలు.. దయ చేయండి! | - | Sakshi
Sakshi News home page

ఇక చాలు.. దయ చేయండి!

Apr 21 2025 7:55 AM | Updated on Apr 21 2025 7:55 AM

ఇక చాలు.. దయ చేయండి!

ఇక చాలు.. దయ చేయండి!

అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలకూ శఠగోపం పెట్టేలా వ్యవహరిస్తోంది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో జేఎన్‌టీయూ(ఏ) ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాల 150, క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల 80, ఓటీఆర్‌ఐ 26, జేఎన్‌టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు.

అంతలోనే ఎంత తేడా..

చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్‌’ను ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్‌ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్‌’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్‌టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. ఎవరిని ఇంటికి పంపుతారో.. ఎవరిని ఉంచుతారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు.గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలు స్తోంది. కూటమి ప్రభుత్వం వస్తే జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడతారని కలలో కూడా ఊహించలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల

తొలగింపునకు కసరత్తు

150 మందిని వెళ్లగొట్టేందుకు చర్యలు వేగవంతం

చిరుద్యోగుల జీవితాలను

చిదిమేసేలా త్వరలో ఉత్తర్వులు

వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

2008 నుంచి పనిచేస్తున్న వారికి జేఎన్‌టీయూ (ఏ) యాజమాన్యం వెన్నుదన్నుగా నిలవాలి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మానుకోవాలి. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్‌’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి.ఇటీవల ‘ఆప్కాస్‌’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

– కే.విజయ్‌, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement