
ప్రాణం తీసిన ఈత సరదా
బ్రహ్మసముద్రం : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన రంగస్వామి (35) కర్ణాటకలో వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. ఇటీవలే స్వగ్రామం చెలిమేపల్లికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గోవిందయ్య దొడ్డి సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. అక్కడ నీటిలోకి దూకిన రంగస్వామి ఎంతకూ పైకి రాలేదు. స్నేహితులు వెదికినా కనిపించకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని కళ్యాణదుర్గం ఫైరింజన్ సిబ్బదికి సమాచారం తెలిపారు. ఫైరింజన్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి అడుగున ఇరుక్కున్న రంగస్వామి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్ఐ నరేంద్రకుమార్, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధురాలి దుర్మరణం
రాయదుర్గంటౌన్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన ఈరక్క (72) 74 ఉడేగోళం గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న మారెంపల్లికి చెందిన ఈశ్వర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈరక్క పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్యోగం రాలేదని బలవన్మరణం
తాడిపత్రిటౌన్: ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన కరుణాకర్, ఇందిర దంపతుల కుమారుడు సపారే నరసింహ (22) బీటెక్ పూర్తి చేశాడు. పలు కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఎక్కడా జాబ్ రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నరసింహ శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
విద్యుత్ షాక్తో రజకుడి మృతి
పామిడి: దుస్తులు ఇసీ్త్ర చేస్తున్న రజకుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. పామిడిలోని వీకే ఆదినారాయణరెడ్డి కాలనీకి చెందిన చాకలి లక్ష్మన్న (62), రమాదేవి దంపతులు. వీరు రజకవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి లక్ష్మన్న కరెంటు ఐరన్ బాక్స్తో దుస్తులు ఇసీ్త్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐరన్బాక్స్ గుండా విద్యుత్ ప్రసారమవడంతో లక్ష్మన్న షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు కుమారులు సంజీవ, ఈశ్వరయ్య, కుమార్తె సునీత సంతానం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కమ్యూనిటీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
గుర్తుతెలియని
మహిళ శవం లభ్యం
ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరు మండలం పందికుంట సమీపంలోని పొలిమేర రిజర్వు ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ శవాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. వయసు 40 నుంచి 50 సంవత్సరాలలోపు ఉంటుందని, బ్లూ కలర్ ప్యారగాన్ చెప్పులు, తెలుపు రంగు పంజాబీ డ్రస్, టాప్ ధరించి ఉందని పేర్కొన్నారు. కుడి, ఎడమ చేతికి రబ్బరు గాజులు ఉన్నాయి. ఈమె ఆచూకీ తెలిస్తే వజ్రకరూరు ఎస్ఐ (94409 01867), ఉరవకొండ రూరల్ సీఐ (94407 96856)కు సమాచారం అందించాలని కోరారు.
అరటి పిలకల ఏజెంట్ టోకరా
గార్లదిన్నె: కల్లూరు చెందిన ఇద్దరు రైతులకు అరటి పిలకల ఏజెంట్ టోకరా వేశాడు. రైతులు గాంధీ, దస్తగిరి 18వేల అరటి పిలకల కోసం నార్పల మండలం గొల్లపల్లికి చెందిన ఏజెంట్ శివయ్యను సంప్రదించారు. ఒక మొక్క రూ.15 చొప్పున మాట్లాడుకున్నారు. అడ్వాన్స్గా రూ.2లక్షల రూపాయలను శివయ్య అసిస్టెంట్కు గత నెలలో ఫోన్ పే చేశారు. ఏప్రిల్ ఎనిమిదో తేదీన బెంగళూరు నుంచి అరటిపిలకలు సరఫరా చేస్తానని ఏజెంట్ చెప్పాడు. అయితే చెప్పిన సమయానికి సరఫరా కాలేదు. దీంతో రైతులు సదరు ఏజెంట్ ఇంటి వద్దకెళ్లి విచారించగా.. తన దగ్గర డబ్బు లేదని, తర్వాత ఇస్తానని చెప్పాడు. తమను నమ్మించి మోసం చేశారని గ్రహించి లబోదిబోమన్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా