నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
తుమ్మపాల : రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని, రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేసి, రెవెన్యూ సేవలలో ఆలస్యం లేకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, ఆక్రమణలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఆన్లైన్ సేవలు, భూ వ్యాపింగ్, రికార్డులు అప్డేషన్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో సుబ్బలక్ష్మి, ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్లు కె.మనోరమ, అనిత, ఆర్డీఓలు షేక్ అయిషా, వి.వి.రమణ, ఏడీ సర్వే గోపాలరాజా పాల్గొన్నారు.


