తుమ్మపాల : కిశోరుల భద్రత, ఆరోగ్యం, సాధికారతే లక్ష్యంగా ‘కిశోరి వికాసం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్ఓ సుబ్బలక్ష్మితో కలిసి కిశోరి వికాసం గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిశోరి బాల బాలికల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, విద్య భద్రతపై అవగాహన కల్పించేందుకు కిశోరి వికాసం కార్యక్రమం ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలికలు, బాలురలో విద్య, పోషణ, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
టెన్త్ టాపర్లకు అభినందన
తుమ్మపాల : పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నుంచే ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావంతో మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకుని మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కిశోరి వికాసం గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్
ప్రభుత్వ పాఠశాల టాపర్లతో కలెక్టర్ విజయకృష్ణన్


