తుమ్మపాల : అనకాపల్లిలో అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న లలిత ఫైల్స్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మాడుగుల మండలం కోడూరు గ్రామానికి చెందిన దళిత మహిళ చోడే పార్వతి ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను వైద్య పరీక్షల కోసం తీసుకొస్తే అర్జెంట్గా పైల్స్ ఆపరేషన్ చేయాలంటుంటూ ఆసుపత్రిలో చేర్చుకుని మొదట చేసిన ఆపరేషన్ వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో రెండవసారి కూడా ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోవడంతో బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించింది.
ఆపరేషన్ల తర్వాత నుంచి కుమార్తె ఆరోగ్యం మరింత విషమించి నాలుగు నెలలుగా మంచాన పడి ఉందని, 25 ఏళ్ల కుమార్తె జీవితం నకిలీ వైద్యుల కారణంగా అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మూడు నెలలుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఎస్పీ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశానని, అధికారులు విచారనణ చేపట్టి న్యాయం చేయాలని ఆమె కోరింది.


