
కలెక్టరేట్లో యోగా
తుమ్మపాల: పరిసరాల పరిశుభ్రతతోపాటు ప్రతి రోజు గంట సమయం యోగాసనాలు వేస్తే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా యోగాంధ్ర సమన్వయ అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన యోగాభ్యాసానికి ప్రతి రోజు సమయం కేటాయించేలా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. యోగా గురువులు బి.అప్పారావు, ఎన్.నగేష్ల సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పి.వి.రత్నం, ఎస్.ఎస్.వి.ఎస్ నాయుడు, రాజేశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.