పిడికిలి బిగిద్దాం..
అనకాపల్లి: యువతకు కూటమి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని, వైఎస్సార్సీపీ వారి తరపున పోరాడుతుందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘యువత పోరు’ పోస్టర్ను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపురెడ్డి అదీప్రాజులతో కలిసి అమర్నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఇచ్చిన వాగ్దానం.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అమలు కాలేదన్నారు. నిరుద్యోగుల పక్షాన ‘యువత పోరు’ సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు.
పార్టీలో యువతకు ప్రాధాన్యం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీలో యువతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, కీలక బాధ్యతలు వారికే అప్పగిస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజల తరపున పోరాడి మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 40 సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు పాలనను.. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు సరిపోల్చి చూస్తున్నారని, 2027లో జమిలి ఎన్నికలు వస్తే అత్యధిక మెజార్టీతో సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
యువజన విభాగం నేతలకు సత్కారం
అనంతరం యువజన విభాగంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాథ్, అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు బాధపు హరికృష్ణ, నీటిపల్లి దివాకర్లను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్లు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మిగున్నయ్యనాయుడు, అనకాపల్లి, కశింకోట మండలాల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ కొణతాల మురళీకృష్ణ, 80, 84 వార్డు ఇన్చార్జ్లు కోరుకొండ రాఘవ, కె.ఎం.నాయుడు, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లేల సాయి కిరణ్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కడిమిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
యువత పక్షాన పోరు బాట
నేడు కలెక్టరేట్ వద్ద నిరసన
మాట తప్పిన కూటమి సర్కారును నిలదీద్దాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపు
‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ
నేడు అనకాపల్లిలో నిరుద్యోగులతో భారీ ర్యాలీ
అనకాపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 23న ‘యువత పోరు’ నిరసన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం 9.30 గంటలకు ర్యాలీ బయలుదేరుతుందని, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.


