
మైదానం.. బస్సుల్లోనే నిద్ర
అల్లూరి జిల్లా నుంచి 25 వేల మందిని గిరిజన విద్యార్థులను తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. వీరికి స్వర్ణభారతి ఇండోర్ స్డేడియం, విశాఖ వ్యాలీ స్కూల్, పెందుర్తి ప్రాంతంలోని ఒక కల్యాణ మండలంలో శుక్రవారం రాత్రి వసతికి ఏర్పాట్లు చేశారు. అయితే 25 వేల మందికి అది సరిపోకపోవడంతో చాలా మంది విద్యార్థులను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లోనే వదిలేశారు. దీంతో విద్యార్థులు గ్రౌండ్లోను, బస్సుల్లోనే ఇబ్బందులు పడుతూ పడుకున్నారు. అలాగే వసతి ఏర్పాట్లు చేసిన వారికి కూడా రాత్రి 10 గంటలకు తీసుకువెళ్లి మళ్లీ ఉదయం 3 గంటలకే సిద్ధం ఉండాలని ఆదేశించారు. తెల్లవారుజామునే అక్కడి నుంచి ఏయూ గ్రౌండ్కు తీసుకువచ్చారు. శనివారం తెల్లవారకముందే మళ్లీ వారు యోగాసనాలకు సిద్ధమయ్యారు. దీంతో వీరికి సరైన భోజనం, నిద్ర లేక నీరసించిపోయారు. ఉదయం 8 గంటలకు యోగాసనాల తర్వాత కూడా టిఫిన్లు అందించే విషయంపై కూడా దృష్టి పెట్టలేదు. కొంత మంది వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలకు ఆ బాధ్యతలు అప్పజెప్పడం, వేల సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో తోపులాట జరిగే అవకాశం ఉంటుందని భయపడి అనేక మంది విద్యార్థులు టిఫిన్ల కోసం వెళ్లలేదు. యోగాసనాల సమయంలో అందించిన కిట్లో ఉన్న అరటి పండు, బిస్కెట్, చెక్కీ తిని అర్ధాకలితోనే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు అల్లూరి జిల్లాకు బస్సులు ఎక్కారు.

మైదానం.. బస్సుల్లోనే నిద్ర