
రికార్డు యోగా
యోగాంధ్రకు రెండు గిన్నిస్ రికార్డులు
విశాఖ సిటీ: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. అట్టహాసంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్ ఎన్ హెల్త్’ నినాదంతో చేపట్టిన యోగాంధ్ర వేడుకల్లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం యోగా విశిష్టతలపై ప్రసంగించారు. అనంతరం 3.03 లక్షల మంది ప్రజలతో కలిసి 45 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు.
రెండు గిన్నిస్ రికార్డులు సొంతం
ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలు వేశారు. 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే శనివారం ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన 326 కంపార్ట్మెంట్లకు 3.03 లక్షల మంది జనాలు వచ్చారు. ఏకకాలంలో సామూహిక యోగాసనాలు వేసినందుకు గాను మరో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతమైంది. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1.47 లక్షల మంది పాల్గొనగా.. విశాఖ జరిగిన కార్యక్రమానికి 3.03 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ రెండు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను మంత్రులు లోకేష్, సత్యకుమార్లకు అందజేశారు.
యుద్ధ నౌకల్లో నేవీ సిబ్బంది విన్యాసాలు
ఈ యోగాంధ్ర కార్యక్రమంలో తూర్పు నావికాదళం కూడా భాగస్వామ్యమైంది. ఈఎన్సీకి చెందిన 11 యుద్ధనౌకలను శనివారం ఉదయం సాగర తీరంలో మోహరించారు. అందులో నేవీ అధికారులు, సిబ్బంది కూడా యోగాభ్యాసాలు చేశారు. వీరితో పాటు 11 వేల మంది నేవీ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు శనివారం ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వేదికల్లో కూడా యోగాసనాలు వేశారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కొన్ని నెలలుగా శ్రమిస్తున్నాయి. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా అహర్నిశలు కష్టపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే లక్ష్యానికి చేరుకోలేకపోయినప్పటికీ.. 3.03 లక్షల మందిని తీసుకువచ్చి గిన్నిస్ రికార్డు సొంతమయ్యేలా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవడంతో ఒకవైపు వారి భద్రత, వసతితో పాటు మరోవైపు జనాల తరలింపు, వారికి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. లోటుపాట్లు ఉన్నప్పటికీ.. యోగాంధ్ర కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఏయూ గ్రౌండ్ దిక్కయింది..
యోగాంధ్రలో గిన్నిస్ రికార్డుకు వేదికై న ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రౌండ్ను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న గ్రౌండ్లో గ్రావెల్ వేసి ఎత్తు పెంచారు. అలాగే దాని ఎదురుగా దశాబ్దాలుగా తుప్పలు, పిచ్చి మొక్కలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రాంతాన్ని సైతం చదును చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏయూ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తప్పుడు ప్రకటనలు చేశారు. ఇప్పుడు 25 వేల మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలకు వేదికై ంది. గిన్నిస్ రికార్డును చేరువ చేసేందుకు పరోక్షంగా కారణమైంది.
పాల్గొన్న పీఎం మోదీ, గవర్నర్, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
25 వేల గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు
3 లక్షలకు పైగా ప్రజలు యోగాసనాలతో సూరత్ రికార్డు బ్రేక్

రికార్డు యోగా

రికార్డు యోగా

రికార్డు యోగా