
మోకాళ్లపై ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
నర్సీపట్నం: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకొని.. మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో త్వరలోనే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి కరక మహేష్, ఉపాధ్యక్షుడు యర్రా ప్రకాష్, కోశాధికారి లాలం నాగేంద్ర పాల్గొన్నారు.