
పీఆర్ఎస్ఐ కార్యవర్గంలో విశాఖకు కీలక పదవులు
మహారాణిపేట: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) జాతీయ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో విశాఖకు చెందిన ఇద్దరు ప్రముఖులకు స్థానం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం వివిధ రాష్ట్రాల నుంచి పీఆర్ఎస్ఐ ప్రతినిధులు హాజరై ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అజిత్ పాథక్ ఎన్నిక కాగా, విశాఖకు చెందిన స్వచ్ఛ భారత్ నిపుణుడు, రోటరీ జిల్లా–3020 మాజీ కార్యదర్శి, రోటరీ బ్లడ్ సెంటర్ మాజీ కార్యదర్శి, పీఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి వరుసగా రెండవసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే కోరమాండల్ సంస్థ మీడియా సలహాదారు, హెచ్.పి.సి.ఎల్. మాజీ అధికారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు యు.ఎస్.శర్మను దక్షిణాది రాష్ట్రాలకు పీఆర్ఎస్ఐ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే 2025–2027 కాలానికి పలువురు కార్యనిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికై న నాయకత్వ బృందం పీఆర్ఎస్ఐ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుందని,, పబ్లిక్ రిలేషన్స్ మెరుగుదలకు, వృత్తిపరమైన అభివృద్ధికి కృషిచేయడానికి, సభ్యుల మధ్య నెట్ వర్కింగ్ను ప్రోత్సహించడం వంటి పనులను కొనసాగించడానికి కృషి చేస్తుందని జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ కార్యవర్గాన్ని విశాఖ శాఖ అధ్యక్షుడు ఎం.కె.వి.ఎల్.నరసింహం, కార్యదర్శి ఎ.గోవిందరావు, కోశాధికారి ఎన్.వి.నరసింహం, ఉపాధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ (పీఆర్) ఆర్.పి.శర్మ, శంకర ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ కె.బంగారు రాజు, విశాఖ శాఖ పూర్వ అధ్యక్షుడు కె.రామారావు తదితరులు అభినందించారు.