ఉపకరణాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచితంగా ఉపకరణాలను కలెక్టర్ నిశాంతి పంపిణీ చేశారు. కలెక్టరేట్లో శనివారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పలు సమస్యలతో బాధపడుతున్న జిల్లాలోని 186 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలతో పాటు ప్రత్యేక సామగ్రి, విద్యాకిట్లు పంపిణీ చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్యశిబిరాలను నిర్వహించి, వైద్యులతో క్షుణ్ణంగా పరిశీలన జరిపిన తరువాత వారికి అవసరమయ్యే పరికరాలు, సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు పాల్గొన్నారు.


