చీడికాడ: వడదెబ్బతో చీడికాడకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పరువాడ ప్రసాదరావు(68)శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పింఛను దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదరావు సచివాలయానికి పలుమార్లు తిరగడంతో వడదెబ్బ గురైనట్టు చెప్పారు.సాయంత్రం సచివాలయం నుంచి వచ్చి అస్వస్థతకు గురై పడిపోవడంతో సపర్యలు చేశామని చెప్పారు.శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పివస్తోందని చెప్పడంతో గ్రామంలోని పీహెచ్సీకి తరలించామన్నారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య నిర్మల తెలిపారు.ప్రసాదరావు భౌతికకాయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల రిజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి కొండబాబు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు,చీడికాడ గ్రామశాఖ అధ్యక్షుడు పరువాడ మహేష్ తదితరులున్నారు. వీరితోపాటు పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు.


