ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కేజీహెచ్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కేజీహెచ్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

రూ.68 లక్షల విలువైన వైద్యం

ఉచితంగా

ఏడాది పాటు ఇమ్యూనోథెరపీ, పరీక్షలు

ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా డాక్టర్‌ శిల్పా

మహారాణిపేట: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న పేద రోగులకు కేజీహెచ్‌ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై జాతీయ స్థాయిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు కేజీహెచ్‌ ఎంపికై ంది. ఈ ట్రయల్స్‌కు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా కేజీహెచ్‌ మెడికల్‌ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ కె.శిల్పా వ్యవహరించనున్నారు.

రూ.68 లక్షల విలువైన వైద్యం.. ఉచితంగా!

ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా రోగులకు ఎంతో మేలు చేకూరనుందని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఏ దశ (స్టేజ్‌)లోనైనా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులకు ఈ ట్రయల్స్‌ ద్వారా ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తారని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే కీమోథెరపితో పాటు, ఎంతో ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ని కూడా క్లినికల్‌ ట్రయల్‌ ద్వారా ఏడాది పాటు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు ఇంతటి అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించడం ఇదే ప్రథమమన్నారు. ఒక్కో సైకిల్‌కు సుమారు రూ.4 లక్షల విలువ చేసే ఇమ్యునోథెరపీ మందును.. ప్రతి మూడు వారాలకు ఒకసారి చొప్పున, ఏడాదికి మొత్తం 17 సార్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు.

బాధితులు సద్వినియోగం చేసుకోవాలి

క్యాన్సర్‌ రోగులకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని కేజీహెచ్‌లో ఉచితంగా అందిస్తున్నామని మెడికల్‌ ఆంకాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ కె.శిల్పా తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా కేజీహెచ్‌ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement