జిల్లా కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: పర్యావరణ పరిరక్షణతోనే ప్రజల భవిత ఆధారపడి ఉందని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీఆర్ పాఠశాల, వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులు పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలితో పాటు పచ్చని పరిసరాలను అందించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. మనకు జన్మనిచ్చిన అమ్మపేరుతో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి తల్లులపై ప్రేమతో పాటు భూమాతను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎఫ్వో ఉమామహేశ్వరి, జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, డ్వామా పీడీ విద్యాసాగర్, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, డీపీవో చంద్రశేఖర్, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ, డీఎల్పీవో కుమార్, వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ చంద్రమోహన్, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
ప్రకృతిని కాపాడుకుందాం.. జేసీ తిరుమణి శ్రీపూజ
డుంబ్రిగుడ: మొక్కలు నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరకు పైనరీలో శాంతినగర్ వీఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అరకు రేంజ్ డీఎఫ్వో ఉమామహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిర్మూలించి కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవాళికి లభించిన విలువైన సంపద ఏదైనా ఉందంటే పర్యావరణమేనని.. దానిని భావితరాలకు భద్రంగా అందించాల్సి బాధ్యత మనందరిపై ఉందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత అడ్డాకుల దొనలను ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో అరకు రేంజ్ ఫారెస్ట్ అధికారి బి.కోటేశ్వరరావు, ఫారెస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


