నక్కపల్లి : ఉపమాక ఆలయంలో చోరీ చేసిన దుండగులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను నియమించినట్టు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన ఉపమాక వెంకన్న ఆలయాన్ని సందర్శించి మరోసారి సీసీ కెమెరాలు పరిశీలించారు. ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు వెనుక నుంచి ఏ విధంగా ప్రవేశించారనే దానిపై మరోసారి ఆరా తీశారు. దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. బుధవారం వేకువ జామున వరకు దొంగతనం జరిగిన ఆలయ పరిసరాలను రికార్డయిన దృశ్యాలను సీసీ పుటేజీల్లో పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఏ సెల్ టవర్ నుంచి మొబైల్ఫోన్లు వాడారు, కొత్త నెంబర్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఉపమాక ఆలయం, నక్కపల్లి హైవే జంక్షన్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు ఆలయం వెనుక బంగారం వెండి ఆభరణాల మూటను ఎందుకు వదిలేశారు? దొంగతనానికి ఏమార్గంలో వచ్చారు, ఏదైనా వాహనం ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట సీఐలు మురళి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.


