కోటవురట్ల: ముగ్గురు స్నేహితురాళ్లు చదువులోనూ తగ్గేదేలే అంటున్నారు. స్నేహమేరా జీవితం అంటూనే పోటీ పరీక్షల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినులు ఏపీ పీజీసెట్, ఏపీ ఈడీసెట్లలో మంచి ర్యాంకులు సాధించి తమ స్నేహబంధానికి గొప్పగా నిర్వచనం చెప్పారు. ఇంటర్లో మంచి స్నేహితురాళ్లుగా పేరొందిన ముత్తుర్తి అక్షయ, పెదపల్లి మరియమ్మ, అరసాడ సరిత చదువులోనూ ప్రతిభ చాటేవారు. జూనియర్ కళాశాలను వీడినా స్నేహాన్ని వదులుకోలేక ముగ్గురూ ఒకే కళాశాలలో డిగ్రీలో చేరారు. పోటీ పరీక్షలకు ముగ్గురు పోటీపడి చదివి మంచి ర్యాంకులు సాధించారు. అక్షయ ఏపీ పీజీసెట్లో 13వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 712వ ర్యాంకు సాధించింది. మరియమ్మ ఏపీ పీజీసెట్లో 15వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 193వ ర్యాంకు, సరిత ఏపీ పీజీసెట్లో 122వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 1,755వ ర్యాంకు సాధించారు. దాంతో అధ్యాపకులు, సహచరులు, తల్లిదండ్రులు వారికి అభినందనలు తెలిపారు.


