దేవరాపల్లి : అప్పులబాధతో దేవరాపల్లికి చెందిన యువ రైతు పోతల సత్తిబాబు (26) ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి రాయాలయం వీధికి చెందిన సత్తిబాబు వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయం చేసేందుకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 2న మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కొల్లివానిపాలెంలోని తన కల్లంలోకి వెళ్లి గడ్డి ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన భార్య మణికి చెప్పాడు. వెంటనే ఆమె తమ బంధువులను తీసుకొని కల్లంలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తను దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించి అనంతరం కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించారు. కేజిహెచ్లో చికిత్స పొందుతూ తన భర్త సత్తిబాబు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మరణించినట్టు మృతుడి భార్య మణి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. సత్తిబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.


