గ్యాస్ సిలిండర్లు కోసం గుమికూడిన వినియోగదారులు
మాడుగుల రూరల్: మండలంలో భారత్ గ్యాస్ వినియోగదారులు మూడు మాసాలుగా గ్యాస్ కష్టాలతో సతమతమవుతున్నారు. మాడుగులలో వెంకట సీతారామ గ్యాస్ ఏజెన్సీ లైసెన్సుదారుడు పుట్టా వెంకట మురళీకృష్ణ ఏడాది క్రితం మృతి చెందారు. ఈయన రెండో కుమారుడు ప్రసన్నరాజు ఈ ఏజెన్సీని కొన్ని నెలల వరకు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీని రద్దు చేసి స్థానిక గోదాం గ్యాస్ వినియోగదారులను జిల్లాలో మాకవరపాలెం, దేవరాపల్లి, అల్లూరు జిల్లాలో పాడేరు గ్యాస్ ఏజెన్సీలకు సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ఏ ఏజెన్సీ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా మాకవరపాలెం నుంచి భారత్ గ్యాస్ ఏజెన్సీ వాహనంతో గురువారం 50 గ్యాస్ సిలిండర్లను ఒమ్మలి చెరకు కాటా వద్దకు తెచ్చారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి 150 మంది ఖాళీ సిలిండర్లతో వచ్చి గంటల కొద్దీ నిరీక్షించారు. ఈ క్రమంలో ఏజెన్సీ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. 50 మందికి ఓ.టి.పి ప్రకారం సిలిండర్లు అందజేసి, మిగిలిన వారికి రెండు రోజుల్లో ఇస్తామని సర్ది చెప్పారు. దాంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు. హెచ్పీ గ్యాస్ సక్రమంగా అందిస్తున్నారని, భారత్ గ్యాస్ సిలిండర్లు అందటం లేదని వాపోయారు.


