పాడేరు: ఓటరు హక్కులను కాపాడటం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో పక్కాగా ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు (బూత్ లెవెల్ ఏజెంట్లు) ఎస్ఐఆర్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం ప్రస్తుతం అత్యంత కీలకమైందని పేర్కొ న్నారు. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుని, వైఎస్సార్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జాబితా నుంచి అర్హులైన వారి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు, నకిలీ ఓటర్లు జాబితాలోకి చేరకుండా అడ్డుకోవాల్సిన పూర్తి బాధ్యత బీఎల్ఏలపైనే ఉందని విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.
శక్తివంచన లేకుండా పనిచేయాలి:
అరకు పరిశీలకుడు వెంకటరామయ్య
వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ కూటమి పార్ట్టీల కుట్రలు, కుతంత్రాలు, ఇతర కొన్ని తప్పిదాల కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఇరవై ఏళ్లకు ఒకసారి చేపట్టే సర్ కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. పార్టీకి చెందిన బీఎల్ఏలు అప్రమత్తంగా లేకపోతే వైఎస్సార్సీపీ సానుకూల ఓట్లు తొలగిపోయి నకిలీ, అర్హత లేని వ్యక్తుల ఓట్లు ఓటర్ల జాబితాలో చేరే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లో తొలగించిన 2.89 కోట్ల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 92లక్షలు, తమిళనాడులో 74లక్షల ఓట్లే నిదర్శమన్నారు. వైఎస్సార్సీపీకి ఓటర్ల సవరణ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అప్రమత్తత అవసరం
జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్సీపీ సానుకూల ఓట్లను దగ్గరుండే తొలగించే కుట్రకు తెరతీసే అవకాశం ఉందన్నారు. తమ అనుకూల ఓట్లను కాపాడుకోవాలన్నా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవాలన్నా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై ఆధారపడి ఉందన్నారు. ఇది చాలా కీలకమైన సమయమన్నారు. అప్రమత్తంగా ఉండి ఓటర్ల సవరణ చేపట్టాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించి వాటిని గుర్తించి సరిదిద్దే కార్యక్రమం చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్నుంచి వచ్చిన శిక్షకులు గణేష్, సతీష్ సర్ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానం, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం ఉన్న వారి వివరాలను నవీకరణ వంటి అంశాలపై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఈనెల 4 నుంచి 12 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మహిళ విబాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జైతీ రాజులమ్మ, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసరి కృష్ణారావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కొరాబు అనూషాదేవి, బోయిన కుమారి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రాంబాబు, మత్య్సకొండం నాయుడు, గుణబాబు, గిరిప్రసాద్, అప్పారావు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, బీఎల్ఏలు, పార్టీ తాజా మాజీ సర్పంచ్లు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


