డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి జలపాతం, అరకు ఫైనరీ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత మూడు వారాలుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో మైదాన ప్రాంత వాసులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు చల్లదనం కోసం ఏజెన్సీ బాట పట్టారు. ఈ క్రమంలో పర్యాటకులంతా చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ, ఎత్తయిన పైన్ చెట్ల నీడన సేదతీరుతూ ఆహ్లాదంగా గడిపారు. మరికొందరు పర్యాటకులు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి, స్థానిక గిరిజనులతో కలిసి ఉత్సాహంగా థింసా నృత్యాలు చేస్తూ ఫొటోలు దిగారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి.


