కొయ్యూరు: సైబర్ మోసగాళ్లు పంపే ఆశాపాత సందేశాలను నమ్మితే నిలువునా మోసపోతారని స్థానిక సీఐ బి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎస్ఐ కిషోర్వర్మతో కలిసి, స్థానిక వారపు సంతకు వచ్చిన గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు చెప్పాలంటూ వచ్చే సందేశాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లలో ఎవరు అడిగినా బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం చెప్పకూడదని సూచించారు. అలా చెబితే ఖాతాల్లోని సొమ్మంతా క్షణాల్లో ఖాళీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ల ద్వారా కేవైసీ అప్డేట్ లేదనో, ఆధార్ లింక్ కాలేదనో కొన్ని ఫైళ్లను, లింకులను పంపిస్తుంటారని.. వాటిని నిజమని నమ్మి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తారని వివరించారు.
గంజాయి సాగు చేస్తే చర్యలు : మన్యంలో గంజాయిని పండించినా లేదా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. అలాగే గిరిజనులు రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనదారులు మద్యం సేవించి లేదా అతివేగంగా నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. బైక్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని సూచించారు. మహిళలపై ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు


