ముంచంగిపుట్టు: ఎలుగుబంటి సంచరించే ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి కె.ఉమామహేశ్వరి సూచించారు. మండలంలోని పనససుట్టు,బరడ , జోలాపుట్టు పంచాయతీల్లోని కడుతుల, ధూలిపుట్టు, పొలిపుట్టు, మొంజాపుట్టు, బొండ్రుగూడ గ్రామాల్లో ఆదివారం అటవీశాఖ అధికారులు పర్యటించారు. ఎలుగుబంటి సంచరించే ప్రదేశాలపై ఆరా తీశారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవహగాన కల్పించారు. మామిడి, జీడి, పనస పంటల సీజన్ కావడంతో ఎలుగుబంటి జన సంచారంలోకి వచ్చిందని, రాత్రి, ఉదయం వేళల్లో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఎలుగుబంటి సంచరించిన కొండ, అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. గ్రామాల్లో పనస, మామిడి, జీడి పండ్లు ఇంటి బయట ఉంచకూడదన్నారు. ఎక్కువ మంది కలిసి మాత్రమే బయటకు వెళ్లాలన్నారు. ఎలుగబంటి కనిపిస్తే రెండు చేతులుపైకి ఎత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్లాలని, వీలైనంత వరకు గుంపులుగా ప్రజలు తిరగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు ఫారెస్టు రేంజర్ ఎం.మురళీకృష్ణ, ఫారెస్టు అధికారులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి
ఉమామహేశ్వరి
కడుతుల, ధూలిపుట్టు, పొలిపుట్టు,
మొంజాపుట్టు, బొండ్రుగూడ గ్రామాల్లో పర్యటన


