డిపో గేటు వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి
ధర్నా చేస్తున్న అసోసియేషన్ ఉద్యోగులు
అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) జోన్ పరిధిలో ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల వేధింపులు, అక్రమ పనిష్మెంట్లు విధించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఏఎన్.రావు తెలిపారు. అసోసియేషన్ జోనల్ కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగువ స్థాయి శాఖ ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల పనిఒత్తిడి, చిన్నచిన్న సమస్యలపై అక్రమ వేధింపులకు గురిచేయడం, విధులు నుంచి తొలగించడం వంటి చర్యలు అన్యాయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


