
తాగునీటి సమస్యపై గ్రామాల్లో ఆందోళన
ముంచంగిపుట్టు: తాగునీటి సమస్యను తీర్చాలని ఖాళీ బిందెలతో మండలంలో గల కించాయిపుట్టు పంచాయతీ గుమ్మసిరగంపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన మహిళలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. గ్రామంలో నీటి కోసం కష్టాలు పడుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం.శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఆర్డబ్ల్యూస్ ఆధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మకై బిల్లులు మాత్రం మారుస్తున్నారని, నీటి పనులు మాత్రం పూర్తి కావడం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులకు ఊటనీరే దిక్కుగా మారుతుందని ఆవేదన చెందారు. కలుషిత నీటితో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి గుమ్మసిరగంపుట్టులో తాగునీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో మహిళలతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ మహిళలు పాల్గొన్నారు.
ఎటపాక: వలస ఆదివాసీలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపాడు గ్రామంలో దశాబ్దాల కాలంగా వలస ఆదివాసీలు నివాసముంటున్నారు. అయితే గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. సోలార్ వాటర్ ట్యాంక్ మూలకు చేరింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సీపీఐ ఎంఎల్ మాస్లైన్ నాయకుడు సాయన్న ఆధ్వర్యంలో గతంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. శుక్రవారం ఖాళీ బిందెలతో సోలార్ వాటర్ ట్యాంక్ వద్ద స్థానికులు నిరసన తెలిపారు. అధికారులు స్పందించి గ్రామానికి విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించి నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. భీమరాజు, శాంతమ్మ, పాలమ్మ, కన్నమ్మ, లక్ష్మి, సునీత, పావని, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యపై గ్రామాల్లో ఆందోళన