ఆదిలాబాద్టౌన్: ఆరోగ్యశ్రీ పథకం కింద డాటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రిమ్స్లో 15 ఏళ్లకు పైగా 13 మంది డాటాఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు పనిచేస్తున్నారు. గత 17 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఇటీవల డీఎంఈని కలిసి తమ సమస్యను విన్నవించారు. సర్దుబాటు చేసి వేతనాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి శ్రీ మహాలక్ష్మి మ్యాన్పవర్ ప్లేస్మెంట్ సర్వీస్ ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వీరిని టర్మినెట్ చేస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసి కాపీలు అందజేశారు. తమను అర్ధాంతరంగా తొలగించడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ గోడు విన్నవిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాలతోనే టర్మినెట్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా బడ్జెట్ విడుదల కావడం లేదని, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు అందజేసి టర్మినెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


