ఇలా వచ్చారు.. అలా వెళ్లారు
● జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
● పెన్గంగ నీటిని మెయిన్ కెనాల్లోకి విడుదల
● రూ.1,891 కోట్ల అంచనా వ్యయంతో కొరటా –చనాఖా బ్యారేజ్ నిర్మాణం కోసం పరిపాలన అనుమతులుమంజూరు చేయడం జరిగిందన్నారు. 5.12 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందన్నారు. దీని ద్వారా ఆదిలాబాద్రూరల్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 89 గ్రామాల్లో 51వేల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతాలప్రజలకు తాగునీరుఅందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
● ఆయకట్టుకు నీటిని అందించేందుకు డి–14 నుంచి డి–19 వరకు ఉప కాలువల నిర్మాణ పనులు చేపడతామని, ప్రాజెక్టులో భాగంగా నీటిని నిల్వ చేసేందుకు పిప్పల్కోటి బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు. కొరటా–చనాఖా బ్యారేజ్కు అనుబంధంగా ప్రధాన కాలువ, మోటార్లతో పంప్హౌస్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాంసి, భీంపూర్ మండలాల్లోని 15 గ్రామాల్లో 13,500 ఎకరాల నూతన ఆయకట్టును వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రూ.368 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం వివరించారు.
● అభివృద్ధి పనుల కోసం 3,313 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా, ఇప్పటివరకు 1,545 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలి పారు. రూ.117 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా 138 కట్టడాలు చేపట్టినట్లు, సాత్నాల వద్ద నదిపై 1.675 కిలో మీటర్ల మేర నిర్మించిన ప్రీకాస్ట్ పోస్టుటెన్షన్డ్ వయాడక్ట్ కోసం రూ.259.81 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉప కాలువల నిర్మాణం చేపట్టి ఆయకట్టు విస్తీర్ణం పెంపొందించడంతో రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన చడీచప్పుడు లేకుండా సాగింది. ఇలా వచ్చారు.. అలా వెళ్లారన్నట్టుగా కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆయన హెలిక్యాప్టర్ ద్వారా నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్కు చేరుకున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఉన్నారు. సీఎంకు ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. అరగంట మాత్రమే ఆయన జిల్లాలో గడిపారు. కొరటా–చనాఖా పంప్హౌస్ వద్ద మీట నొక్కి పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి వదిలారు. ఆ తర్వాత అందులో పారుతున్న గంగాజలాలకు పూజలు చేశారు. పూలు, చీరసారెలు అందులోకి వదిలారు. అనంతరం హత్తిఘాట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు తిరిగి చేరుకొని అక్కడి నుంచి నిర్మల్ బయల్దేరి వెళ్లారు. పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..
ఫొటో స్టాల్ సందర్శన..
హత్తిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో నేరుగా హెలిక్యాప్టర్ నుంచి దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రత్యేకంగా నిర్మించిన రోడ్డు మార్గం ద్వారా పంప్హౌస్ వద్దకు చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్ను సందర్శించారు. నీటి విడుదలకు సంబంధించిన వివరాలను కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియజేశారు.