
శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగు
రాజానగరం: పొందిన శిక్షణను ఆచరణలో పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని, వ్యవసాయాన్ని వ్యాపార సరళిలో చేపట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. నర్సరీ యాజమాన్యం – ఉద్యాన పంటలలో అంట్లు కట్టే పద్ధతులపై కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో వారం రోజుల పాటు జరిగిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శేషుమాధవ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కేవీకే ద్వారా రైతులు, రైతు మహిళలు, యువతకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవీకే ప్రధానాధికారి డాక్టర్ వీఎస్జీఆర్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఉద్యాన పంటల విభాగంతో పాటు వెటర్నరీ, ఫిషరీస్, గృహ విజ్ఞానం, సస్యరక్షణ మున్నగు అంశాలపై జిల్లా ఆత్మ ప్రాజెక్టు సహకారంతో శిక్షణ కొనసాగిస్తామన్నారు. జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వై.జ్యోతిర్మయి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అవగాహన చేసుకునే విధానాలను శిక్షణలో వివరించడం హర్షణీయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని గొల్లప్రోలు, బిక్కవోలు, రాజానగరం, కడియం మండలాలకు చెందిన 15 శిక్షణకు హాజరుకాగా, వారికి సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కేవీకే ఉద్యాన పంటల అధికారి జేవీఆర్ సత్యవాణి కోర్సు కో ఆర్డినేటర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్రుపా, కామానంద్ మిశ్రా, శాంతి వర్థన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ వీరబాబు, రఘువీర్, సుచరిత పాల్గొన్నారు.