
ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి
● మాల మహానాడు జేఏసీ డిమాండ్
● అమలాపురంలో బహిరంగ సభ, ప్రదర్శన
అమలాపురం టౌన్: ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలని మాల మహానాడు జిల్లా ఐక్య వేదిక బహిరంగ సభ డిమాండ్ చేసింది. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో మాల మహానాడు ఐక్య వేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మాలల బహిరంగ సభ ఆదివారం జరిగింది. ఐక్య వేదిక నేత, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు నాయకుడు యర్రమిల్లి రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పీవీ రావుకు నేతలంతా ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాల జాతి కోసం ప్రాణాలు అర్పించిన పీవీరావు త్యాగ ఫలం వృథా కానివ్వమని ప్రతి వక్త తమ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాల మహానాడు ఐక్య వేదిక పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని వక్తలు అన్నారు. వర్గీకరణకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పునాది వేస్తే, ప్రధాని మోదీ ఆ పునాదిపై మేడలు కడుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు అంతం, మాలల పంతం అంటూ నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మాహానాడు జేఏసీ సుప్రీంకోర్టులో పిల్ వేయాలని బహిరంగ సభ తీర్మానం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు న్యాయస్థానాలకు సంబంధం లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండ్రు బాబ్జి, రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు పెయ్యల పరశురాముడు, మెండు రమేష్బాబు, జగడం సత్యనారాయణ, నక్కా సంపత్కుమార్, జల్లి శ్రీనివాస్, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు సభలో ప్రసంగిస్తూ వర్గీకరణ జోలికి వచ్చిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని ప్రకటించారు. అనంతరం మాల మృతవీరుల సంస్మరణ సభ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన ఉద్యమంలో అశువులు బాసిన మాల మృతవీరులకు నివాళులు అర్పించారు.
భారీ నిరసన ప్రదర్శన
బహిరంగ సభకు ముందు అమలాపురం ప్రధాన రోడ్డుపై మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పట్టణ సీఐ కె.కృష్టోఫర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.