breaking news
yaddurappa
-
బీజేపీ ప్రభుత్వానిది పిరికి చర్య: సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: గోవధ నివారణ, పశువుల సంరక్షణ బిల్లు-2020ను కర్ణాటక ప్రభుత్వం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఆవులు, దూడలను వధించకూడదు. చట్టవిరుద్ధంగా ఆవులను అమ్మడం, రవాణా చేయడం లేదా నరకడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఆమోదించడంతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ట్విటర్లో దుయ్యబట్టారు. గోవధ బిల్లును శాసనసభలో కనీసం చర్చించకుండానే యడియూరప్ప ప్రభుత్వం ఆమోందించిందని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. బీజేపీ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ బిల్లులు ఎజెండాలో లేవని రాష్ట్ర బిజినెస్ అడ్వయిజరీ కమిటీ తెలియజేసిందని గుర్తుచేశారు. బిల్లును చర్చించలేని పిరికి ప్రభుత్వం బీజేపీ అని, అందుకే యడియూరప్ప ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందన్నారు. అవినీతి నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. బీజేపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామని ట్విటర్లో పేర్కొన్నారు. -
బీజేపీకి కర్ణాటక కిక్కు
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కేవలం రెండే దక్కడంతో ఈ పరాజయానికి నైతికబాధ్యత వహించి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు రాజీనామా చేశారు. అంచనా లకు మించి 12 స్థానాలు గెల్చుకున్న బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది. అక్కడ పాత మిత్రుల్ని వదిలించుకుని ఒంట రిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఇలాంటి సమయంలో అంచనాలను మించి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలనిచ్చింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఈ 15 స్థానాల్లో పన్నెండింటిని కాంగ్రెస్ గెల్చుకోగా, మూడుచోట్ల జేడీఎస్ విజయం సాధిం చింది. వీరు, వీరితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి ఫిరాయించడంతో 14 నెలల పాటు పాలించిన హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మొన్న జూలైలో కుప్పకూలింది. మరో రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు పెండింగ్లో ఉన్నందువల్ల వాటికి ఉపఎన్నికలు జరగలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమకు గరిష్టంగా 9 స్థానాలు రావొచ్చునని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఫలితాలు దాని అంచనాలను మించాయి. పైగా జేడీఎస్కు కంచుకోట అయిన ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది. 224మంది సభ్యులుండే కర్ణాటక శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 113. ఇప్పటికే బీజేపీకి 105 స్థానా లుండగా, ఉప ఎన్నికల తర్వాత దాని బలం 117కి చేరుకుంది. ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటారని, అందువల్ల ఫిరాయింపుల కార ణంగా సభ్యత్వం కోల్పోయి, బరిలో నిలిచిన వారంతా ఓటమి పాలవుతారని రాజ్యాంగ నైతికతను కోరుకునే వారంతా ఆశించారు. ఈ ఫిరాయింపులతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్లు సైతం అలాగే కోరుకున్నాయి. జనమంతా ఫిరాయింపుదార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావిం చాయి. అయితే ప్రజలు కేవలం ఫిరాయింపుల అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావించడం దురాశ. ఈ ఫిరాయింపుల కారణంగా పతనమైన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అంతక్రితం 14 నెలలపాటు ఎలా పాలించిందో కూడా వారు అంచనా వేసుకున్నారు. ఆ 14 నెలలూ రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే సరిపోయింది. రెండు మూడు సందర్భాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. ఏం చేద్దామనుకున్నా తనకు అడ్డంకులు ఎదురవు తున్నాయని ఆయన వాపోయారు. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేశాయి. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఉదాహరణకు కృష్ణరాజపేటె స్థానం నుంచి నిరుడు తమ పార్టీ అభ్యర్థిగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన నారాయణగౌడపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగా ప్రచారం చేశారు. రాజకీయంగా తమ గొంతు కోసిన ఆయనను చిత్తుగా ఓడించాలని ఎంతో ఉద్వేగంతో పిలుపునిచ్చారు. కానీ జనం నారాయణగౌడకే పట్టంగట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గాం జిల్లాలో గెలుపుపై బీజేపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. పొరుగు రాష్ట్రంలోని పరిణామాలు ఈ ఉప ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని వారు భావించారు. కానీ అక్కడ కూడా విజయం సాధించడం వారిని ఉత్సాహపరిచింది. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయంగా ఊపిరిపోశాయి. నిజానికి ఆయన ఒకరకంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. 75 ఏళ్లు దాటిన నేతలు ముఖ్య పదవుల నుంచి వైదొలగాలన్న సూత్రానికి విరుద్ధంగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్ప లేదు. ఫిరాయింపుదార్లందరికీ టికెట్లివ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదన్న వార్తలొచ్చాయి. కానీ యడియూరప్ప పట్టుబట్టి పార్టీ టిక్కెట్లు వచ్చేలా చేశారు. పైగా గెలిస్తే వీరికి మంత్రి పదవులు ఇస్తామని కూడా ప్రచారసభల్లో చెప్పారు. అది ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. పార్టీ కేంద్ర నాయకులెవ్వరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలి గారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. రాజకీయంగా తమ భవిష్యత్తేమిటన్న గాభరా కలిగిస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాలి. ఆంతరంగిక కలహాల్లో తలమునకలైతే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్లకు ఎదురైన చేదు అనుభవమే మున్ముందు బీజేపీకి కూడా తప్పకపోవచ్చు. -
జాతకం తారుమారు అయ్యిందా?
సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్కు కేబినెట్లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది. చదవండి: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం పదవుల సంగతేమిటి? అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్ డిమాండ్ చేయవచ్చు. ఆది నుంచీ ఆవేశాలు అనర్హతకు గురయిన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎ.శివరామ్ హెబ్బార్ ( యల్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్.రోషన్ బేగ్ (శివాజీనగర); ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్ పేట); కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్ (చిక్కబళ్లాపుర); హెచ్. విశ్వనాథ్(హుణసూరు); బీసీ పాటిల్ (హీరేకరూర్); ఆనంద్ సింగ్ (హొసపేట); ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర). -
అందరూ అందరే!
త్రికాలమ్ కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యప్రియులకు పెద్దగా సాంత్వన కలిగించవు. సంఖ్యాబలం లేకపోయినా జబర్దస్తీగా అధికారం హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వమ్ము చేయడం సంతోషించదగినదే. ముఖ్యమంత్రిగా 55 గంటల క్రితం యడ్యూరప్ప ప్రమాణం చేసినప్పటి నుంచీ రాజీనామా చేసేవరకూ ఉత్కంఠ కలిగించే అనేక ఘటనలు జరిగాయి. 222 మంది సభ్యులు ఉండే కొత్త శాసనసభలో 104మంది సభ్యులు మాత్రమే కలిగిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడం అంటే ఎంఎల్ఏల ఫిరాయింపులకూ, బేరసారాలకూ అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నుంచి కొచ్చికి శుక్రవారం సాయంత్రం ప్రయాణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎంఎల్ఏలు తెల్లవారే సరికి హైదరాబాద్లో తేలారు. ఐదారు నక్షత్రాల హోటళ్ళలో బస చేశారు. వారితో సమాలోచనలు జరపడానికి బెంగళూరు నుంచి గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రభృతులు వచ్చారు. సుప్రీం తీర్పుతో హుటాహుటిన బెంగళూరు తిరిగి వెళ్ళారు. శనివారం ఉదయం శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతూ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల ఆచూకీ తెలియడం లేదనీ, ఎనిమిది మంది బీజేపీకి మాట ఇచ్చేశారనీ బ్రేకింగ్న్యూస్ రూపంలో టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. బెంగళూరులో, ఢిల్లీలో సర్వాత్రా ఉద్వేగభరితమైన దృశ్యాలు. జాతి యావత్తూ కర్ణాటక రాజధానిపైన దృష్టి నిలిపిన సందర్భం. భోజన విరామం తర్వాత ప్రమాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులూ ప్రత్యక్షమైనారు. అంతలోనే యడ్యూరప్ప ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి, పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి సభ నుంచి విసవిసా వెళ్ళిపోయారు. తాత్కాలిక సభాపతి సైతం జాతీయగీతం ఆలపించే వరకూ వేచి ఉండకుండానే నిష్క్రమించారు. న్యాయవ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి న్యాయస్థానాలు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జేడీ (ఎస్), కాంగ్రెస్ల పిటీషన్లపైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బీజేపీకి అశనిపాత సదృశమైన నిర్ణయాలు వెలువరించింది. బీజేపీ అడిగిన వరాలలో ఒక్కటీ మంజూరు చేయకుండా యడ్యూరప్ప ఆశలు అడియాసలు చేసింది. యడ్యూరప్పను ఆహ్వానిం చాలన్న గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టకపోయినా బలనిరూపణకు రెండువారాల వ్యవధి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఒక్క వారమైనా గడువు ఇవ్వాలంటూ బీజేపీ చేసిన వేడుకోలునూ అంగీకరించలేదు. కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చింది. సీక్రెట్ బ్యాలట్ నిర్వహించాలన్న కోర్కెకు సైతం ససేమిరా అన్నది. గతంలో యడ్యూరప్పకు అనుకూలించే విధంగా వ్యవహరించాడంటూ న్యాయస్థానం మొట్టికాయలు తిన్న బోపయ్య చేత తాత్కాలిక సభాపతిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శనివారం ఉదయం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బోపయ్య నియామకాన్ని రద్దు చేయలేదు కానీ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ ఎంఎల్ఏలను ప్రభావితం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు రాజకీయాలంటే వెగటు పెరిగి ఉంటుంది. గోవాలో దిగ్విజయ్సింగ్ నిర్వాకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఈసారి ఆజాద్నీ, గెహ్లాట్నీ బెంగళూరు పంపించి బీజేపీ ఆటకట్టించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచారు. జేడీ (ఎస్), కాంగ్రెస్లకు చెందిన శాసనసభ్యులు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదని గ్రహించిన యడ్యూరప్ప రాజీనామా చేయాలనుకోవడం సముచి తమే. ఈ నిర్ణయం యడ్యూరప్పదైనా, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలది అయినా అభినందనీయమే. ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఇతర నాయకులు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటూ రాజ్యసభలో నోటీసు ఇచ్చి, అందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, చివరికి పరిస్థితులు అనుకూలించక దాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ స్తుతించడం విడ్డూరం. కర్ణాటక వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగింది. అందులో సందేహం లేదు. కానీ తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మెచ్చుకోవడం, ప్రతికూలంగా వచ్చినప్పుడు పక్షపాతం ఆపాదించడం రాజకీయ నాయకులకు తగదు. అలాగే రాజ్యాంగాన్ని అదే పనిగా ఉల్లంఘించిన నాయకులు కర్ణాటక పరిణామాలపై వ్యాఖ్యానించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించినందుకు సుప్రీంకోర్టును అభినందించడం మరో వింత. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి రాజ కీయ నాయకుడికి రాజ్యాంగబద్ధతపైనా, రాజకీయ విలువలపైనా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? 1996లో 13 రోజులు అధికారంలో ఉండి బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజపేయితో యడ్యూరప్పను ఒకందుకు పోల్చవలసి వస్తున్నది. ఇద్దరి వ్యక్తిత్వాలూ, నైతిక స్థాయీ, దృక్ప«థాలూ వేరైనప్పటికీ లోక్సభలో నాటి పరిస్థితులకీ, కర్ణాటక శాసనసభలో నేటి వాతావరణానికీ ఎంతో కొంత సామ్యం ఉంది. నాడు వాజపేయి లోక్సభలో బలం నిరూపించుకోలేక వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రిగా దేవెగౌడ అందలం ఎక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా అనంతరం ముఖ్యమంత్రిగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పుడు దేవెగౌడ 46 మంది ఎంపీల బలంతో ప్రధాని కాగలిగితే ఇప్పుడు కుమారస్వామికి తనతో సహా 37 మంది జేడీ (ఎస్) ఎంఎల్ఏలు ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ మద్దతు స్వీకరించినవారే. దేవెగౌడ సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న కారణంగా పదవీచ్యుతులైనారు. కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్న. అనిశ్చితికీ, అస్థిరతకూ దారితీసే అంశాలు అనేకం కర్ణాటక రాజకీయాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రాహుల్ తప్పిదం సమాజాన్నీ, పార్టీలనూ విభజించే ప్రమాదభూయిష్టమైన రాజకీయాన్ని అన్ని పార్టీలూ బాధ్యతారహితంగా ప్రోత్సహించాయి. కావేరీ నీటి కంటే విరివిగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేశాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏటీఎంలలో డబ్బులు లేకుండా, రెండువేల రూపాయల నోట్లు మచ్చుకైనా కనిపించకుండా చేశాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు యధేచ్ఛగా చేసుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలతో, నిందారోపణలతో ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఎన్నికలలో గెలుపొందేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారనీ, గెలిచినవారిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరనీ, అందుకు గవర్నర్ ఎంత వ్యవధి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారనీ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా సాధారణ ప్రజలకు విశ్వాసం ఏముం టుంది? కర్ణాటకంలో ఒక అంకానికి తెర పడింది. రెండో అంకానికి తెర లేవబోతున్నది. జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం కంఠీరవ స్టేడియంలో పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు చెందిన దళిత నాయకుడు జి. పరమేశ్వర ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్యను సంపూర్ణంగా బలపరిచే ప్రయత్నంలో రాహుల్గాంధీ ఒకానొక రాజకీయ తప్పిదం చేశారు. 2006లో జేడీ(ఎస్) నుంచి వైదొలిగి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచీ సిద్ధరామయ్యకూ, దేవెగౌడ కుటుంబానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య దాన్ని ప్రదర్శించడమే కాకుండా రాహుల్తో కూడా దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. జేడీ (ఎస్)లో ‘ఎస్’అంటే సంఘ్ పరివారమనీ, జేడీ (ఎస్) బీజేపీకి ‘బీ–టీమ్’అనీ రాహుల్ నిందాస్త్రాలు సంధించారు. తన బొందిలో ప్రాణం ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ దేవెగౌడ పలుమార్లు ప్రకటించినా రాహుల్ వినిపించుకోలేదు. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధినేత మాయావతితో ప్రచారం చేయించినా జేడీ (ఎస్) నాయకత్వాన్ని విశ్వసించలేదు. లోగడ దేవెగౌడ బీజేపీ పట్ల ఇదే విధమైన ప్రతికూలత వెలిబుచ్చారనీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కుమారస్వామితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానని ప్రకటించారనీ, తీరా కుమారస్వామి అదే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనందించారనీ విమర్శకులు గుర్తు చేస్తారు. రాహుల్ కాంగ్రెస్ అధినేతగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలనీ, ప్రతి లోక్సభ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అత్యంత యోగ్యుడైన అభ్యర్థిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి నిలబెట్టాలనీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొం దించవలసిన రాహుల్ దేవెగౌడ కుటుంబంపైన మితిమీరి దాడి చేయడం అవివేకం. ఆ స్థాయిలో విరుచుకుపడకుండా ఉంటే నేటి మైత్రి అంత కృతకంగా కనిపించేది కాదు. మొత్తం మీద జేడీ (ఎస్), కాంగ్రెస్లు దక్షిణ కర్ణాటకలో హోరాహోరీ పోరాడాయి. అక్కడ బీజేపీ ఉనికి తక్కువ. ఆ విధంగా ద్వేషం పంచుకున్న రెండు పక్షాలు కేవలం బీజేపీని నిలువరించడంకోసం ఒకే తాటిమీదికి రావడం అవకాశవాదం అనాలో, సమయజ్ఞత అనాలో తేల్చుకోవడం కష్టం. రేపటి నుంచి ఈ సంకీర్ణం అంతర్గత విభేదాలను ఎట్లా పరిష్కరించుకుంటుందో, ప్రతిపక్ష బీజేపీని ఎట్లా ఎదుర్కొంటుందో మరి. కుమారస్వామి సారథ్యం విభజన రేఖలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమైక్యంగా ఉంటామనీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ నమ్మబలికే నాయకులను నమ్మడం ఎట్లా అన్నది కర్ణాటక ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు సోనియా, రాహుల్ అత్యవసర సమాలోచన జరిపి జేడీ (ఎస్)కు షరతులు లేని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఇదే ప్రాప్తకాలజ్ఞత. ఢిల్లీలో నిర్ణయించినంత మాత్రాన స్థానికంగా నిన్నటి వరకూ ఒకరిపైన ఒకరు పోరాడుకున్నవారు సఖ్యతతో ఉండగలరా? తమ శాసనసభ్యులు నైతిక విలువలను కాపాడారనీ, బీజేపీ ప్రలోభాలకు లొంగలేదనీ కాంగ్రెస్ అధినాయకత్వం కితాబు ఇచ్చింది. తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను వీడి టీడీపీ పంచన చేరిన శాసనమండలి సభ్యులూ నిక్షేపంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయమని రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తేవడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన. యడ్యూరప్ప అధికారంలో కొనసాగి ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, జేడీ (ఎస్)కు కర్ణాటకలో విజయావకాశాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అధికారం పంచుకుంటున్నాయి కనుక సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి సానుకూల వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉన్నది కనుక కర్ణాటకలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అప్పటి వరకైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయం రెండు పార్టీలకూ ఉంటుంది. అదొక్కటే ఊరట. కె. రామచంద్రమూర్తి -
కన్నడ పోల్: ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు
-
యడ్యూరప్ప, కుమారస్వామిలపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: ఓ భూమి డీనోటిఫికేషన్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్.డి.కుమారస్వామిలపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వారిద్దరిపై అవినీతి నిరోధక చట్టంతోపాటు నేరపూరిత కుట్ర, చీటింగ్ సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక్కడి ఆర్.టి.నగర్లోని మతదహళ్లి లేఅవుట్లోని భూమిని డీనోటిఫై చేసిన వ్యవహారంలో ఇద్దరు నేతల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయని లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్ తెలిపారు.