breaking news
women lawyer
-
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా(46) అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవిని అధిరోహించనున్నారు. వనితా గుప్తాను అసోసియేట్ అటార్నీ జనరల్గా ఎంపిక చేస్తూ అమెరికా సెసేట్ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జనరల్గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్ కూడా వనితనే కావడం గమనార్హం. ఎంపిక విషయంలో సెనేట్లో బుధవారం జరిగిన ఓటింగ్లో వనితకు మద్దతుగా రిపబ్లికన్ మహిళా సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ ఓటు వేశారు. దీంతో 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. ఒకవేళ ఓటింగ్ ‘టై’ అయితే తన ఓటును వినియోగించుకునేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్కు వచ్చారు. సెనేట్ రెండు పార్టీలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్ అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తించారు. -
వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు!
నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి. నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది. ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం.. – ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు. నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు ఉదాహరణ దీపికా రజావత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె. అడుగడుగునా అవరోధాలే ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది అసహ్యించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. చంపేస్తారు.. నాకు తెలుసు ‘‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. కథువా ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా. ‘‘అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా వేధింపులు ఎదుర్కొన్నారు. నన్నో జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను’’ అంటూ ‘వోగ్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’–2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్ తన అనుభవాలను పంచుకున్నారు. కథువా ఘటన కశ్మీర్లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చి, ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను అంతమొందించారు కొందరు. బాకర్వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపమూ చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్లోని పఠాన్ ఫాస్ట్ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
లైవ్ షోలో మహిళపై మౌలానా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్పై ఓ న్యూస్ చానెల్ చేపట్టిన చర్చ తీవ్ర గొడవకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారంలో విచక్షణ కోల్పోయిన ఓ ప్రతినిధి.. ఏకంగా మహిళా లాయర్పై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే మహిళపై దాడి చేసిన సదరు ప్రతినిధిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్లో లేనేలేదని ఓ మహిళ న్యాయవాది వాదించగా.. సహనం కోల్పోయిన ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఆమెపై దాడి చేశాడు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఓ టీవీ ఛానల్ మంగళవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లైవ్గా ప్రసారమైన ఈ చర్చలో భాగంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్ మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందడం ఖురాన్లో లేదని, ట్రిపుల్ తలాక్ ఖురాన్కు విరుద్ధమని వ్యాఖ్యనించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా ఇజా అర్షద్ ఖ్వాసి.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్ షోలోనే దాడికి దిగారు. ఫరాహ్ గత కొంతకాలంగా ముస్లిం మహిళల తరఫున ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. టీవీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎఐఎంపీఎల్బీ సభ్యుడు మహిళ న్యాయవాదిపై దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. A Maulana Amir Kasmi who is a member of AIMPLB hit a woman on a live TV debate. If he does ths on TV, imagine what these people would be doing behind closed doors. The Maulana even used abusive words for women on the panel... Shamefull !!!!#MaulanaSlapsWoman #TalkToAMuslim pic.twitter.com/wXs8fcJqPD — Sourish Mukherjee (@me_sourish) July 17, 2018 -
సుప్రీంలో మహిళా లాయర్ ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది ఆత్మాహత్యాయత్నం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా కేసుల విచారణ అనంతరం తన స్థానం నుంచి లేచి వెళుతున్నప్పుడు ఛత్తీస్గఢ్కు చెందిన మహిళా న్యాయవాది తనపై భర్త కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ఆమె మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో తోటి మహిళా న్యాయవాది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మహిళా న్యాయవాది తాను నాప్తలిన్ బాల్స్ మింగానని చెప్పారు. ఆమెను సుప్రీంకోర్టు ఆస్పత్రికి తరలించాలని లోధా ఆదేశించారు.