breaking news
Winter intensity
-
రాత్రిళ్లు చలి తీవ్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్లో 7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు, మెదక్లో 6 డిగ్రీలు తగ్గి 10 డిగ్రీల చొప్పున నమోదు కావడం గమనార్హం. రామగుండంలో ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 4 డిగ్రీలు తగ్గి 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండలో 14, నిజామాబాద్, హకీంపేటల్లో 15, నల్లగొండ, మహబూబ్నగర్లలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్తంత పెరిగాయి. ఖమ్మంలోనైతే సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. కాగా శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత
విశాఖ: విశాఖ మన్యంలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పివేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది. బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట లేదు. పాడేరు, మినములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పోతురాజుగుడి సమీపంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదుకొండమ్మ పాదాల వద్ద 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.