breaking news
Wildlife Conservation Society
-
వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్లో ‘వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ’రూపొందించిన వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ను మంత్రి ఆవిష్కరించారు. కిట్ పని తీరు, శాంపిల్స్ సేకరణ, వైల్డ్లైఫ్ డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు. వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. నేర పరిశోధనలో ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమైందన్నారు. బయోలాజికల్ ఎవిడెన్స్ ద్వారా వేట గాళ్ళకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందన్నారు. ఉపయోగించే తీరుపై అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చి కిట్లను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
20 ఏళ్లలో 10% అటవీ ప్రాంతం మాయం!
హైదరాబాద్: భూమ్మీద ఏటికేడాదీ పచ్చదనం కరువవుతోందన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈ నష్టం కచ్చితంగా ఎంతమేరకు ఉందన్నది మాత్రం అస్పష్టం. అయితే వైల్డ్లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ జరిపిన తాజా అధ్యయనం ఈ అనుమానాన్ని నివృత్తి చేసింది. సొసైటీ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం గత 20 ఏళ్లలో భూమ్మీద ఉన్న నిర్జన అటవీ ప్రాంతం విస్తీర్ణం దాదాపు 10 శాతం... అంటే 12.7 లక్షల చదరపు మైళ్లు తగ్గింది. ఇది అలస్కా అంత సైజు ఉంటుందని అంచనా. ఇలా నష్టపోయిన అటవీ ప్రాంతంలో అత్యధికం ఆఫ్రికా, అమెజాన్లలోనే ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం భూమ్మీద మనిషి ప్రభావం ఏమాత్రం లేని భూభాగం విస్తీర్ణం 23.2 శాతం మాత్రమేనని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ తెలిపారు. నిర్జన అటవీ ప్రాంతాన్ని మళ్లీ సృష్టించడం అసాధ్యమని, మొక్కలు నాటినంత మాత్రాన అడవులను, వాటిల్లో ఉండే పర్యావరణ వ్యవస్థల పునఃసృష్టి జరగదని ఆయన తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే... ప్రకృతిలో మిగిలి ఉన్న అతికొద్ది నిర్జన ప్రాంతాలనూ కోల్పోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.