breaking news
weter
-
‘నర్వ’ నీటి నిల్వలు.. దేశానికే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నీటిఎద్దడితో కరువు ప్రాంతంగా పేరున్న నారాయణపేట జిల్లాలో ఇప్పుడు జలసిరులు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు మన తెలంగాణలోని ‘నర్వ’బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘వాటర్ బడ్జెటింగ్ ఇన్ ఆస్పిరేషనల్ బ్లాక్స్’నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. దేశంలోని ఇతర ఆస్పిరేషనల్ బ్లాక్లు నీటిలోటుతో సతమతమవుతుంటే...నర్వ మాత్రం 33 శాతం మిగులు జలాలతో నీటి భద్రతలో తమకు సాటిలేరని నిరూపించుకుంది. తక్కువ వాన.. అయినా నిండు కుండలా నర్వ బ్లాక్లో సగటున నమోదయ్యేది కేవలం 524 మిల్లీమీటర్ల వర్షపాతమే. సాధారణంగా ఇంత తక్కువ వర్షపాతం ఉంటే.. ఆ ప్రాంతం నీటిఎద్దడిని ఎదుర్కోవాలి. కానీ, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, నీటి నిల్వ సామర్థ్యం అద్భుతాలను సృష్టిస్తున్నాయి. నర్వలో కురిసే వర్షం ద్వారా వచ్చే నీరు తక్కువే అయినా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టడంలో ఈ బ్లాక్ విజయం సాధించింది. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం.. నర్వలోని చెరువులు, కుంటలు, ఇతర జల వనరుల్లో ఏకంగా 23,371 హెక్టార్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. సాగు నీరే సింహభాగం నర్వ బ్లాక్లో నీటి వినియోగం ప్రధానంగా వ్యవసాయం చుట్టూనే తిరుగుతోంది. బ్లాక్లో అందుబాటులో ఉన్న నీటిలో 91 శాతం కేవలం సాగుకే వినియోగిస్తున్నారు. ఇక్కడ గొర్రెల పెంపకం (సుమారు 1.08 లక్షలు) కూడా ఎక్కువే అయినా, వాటి నీటి అవసరాలు తక్కువగానే ఉన్నాయి. మానవ అవసరాలకు 6 శాతం నీటిని వాడుతున్నారు. భూగర్భ జలాలపైనే భారం.. మారాల్సిన తీరు నీటి నిల్వల్లో నర్వ మిగులు సాధించినా, క్షేత్రస్థాయిలో రైతులు ఇంకా భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. బ్లాక్లో 70 శాతం నీటి సరఫరా భూగర్భ జలాల నుంచే జరుగుతోంది. ఉపరితల నీటి వాటా కేవలం 30 శాతమే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ భూగర్భ జలాలు ‘సేఫ్’జోన్లోనే ఉన్నా, భవిష్యత్లో బోరుబావుల వినియోగం తగ్గించి, చెరువు నీటిని సాగుకు మళ్లించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నర్వ విజయ రహస్యాలివే నీటి లభ్యత: 2,163 హెక్టార్ మీటర్లు. నీటి అవసరం: 1,627 హెక్టార్ మీటర్లు. మిగులు జలాలు: +536 హెక్టార్ మీటర్లు (33% సర్ ప్లస్) సేఫ్జోన్: భూగర్భ జలాల వినియోగం 40.78 శాతంతో ‘సురక్షిత’వర్గంలో ఉంది. మిషన్ భగీరథ సక్సెస్: ‘జల్ జీవన్ మిషన్’కింద ఈ బ్లాక్లో 100 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది. ⇒ నర్వలో ఉపరితల నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున, రైతులు బోరుబావులపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తద్వా రా భూగర్భ జలాలను భవిష్యత్ తరాలకు భద్రపరచవచ్చని నీతి ఆయోగ్ తమ నివేదికలో సూచించింది. -
శ్రీశైలంలో 4, సాగర్లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
రెండోసారి బోణి లేదు!
– సొరంగం పనులకు దాఖలు కానిటెండరు –రెండోసారీ అధికారులకు భంగపాటు –నిబంధనలు సడలించినా రాని స్పందన –హంద్రీనీవా పనుల్లో అనివార్యమైన జాప్యం బి.కొత్తకోట: హంద్రీ–నీవా సాగునీటి ప్రాజñ క్టులో సవాలుగా మారిన సొరంగం పనులు మరింత జాప్యమయ్యేలా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో టన్నల్ (సొరంగం) పనులకు రెండోసారి నిర్వహించిన టెండర్లకు ఒక్క టెండరూ దాఖలుకాలేదు. గొళ్లపల్లె నుంచి వైఎస్సార్కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు మట్టిలో సొరంగ మార్గం తవ్వేపని అప్పగించేందుకు 20బి ప్యాకేజిలోని 2కిలోమీటర్ల పనికి రూ.70.82కోట్లతో జూన్లో ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. టెండర్లలో మ్యాక్స్ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొంది. రూ.70.82కోట్ల పనికి 3.99శాతం (రూ.2.80కోట్లు) అదనంతో టెండర్ దాఖలు చేయగా దీన్ని రద్దు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్ కమిటి (సీఓటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో టెండర్ల వ్యవహారం మొదటికొచ్చింది. రెండోసారి టెండర్లు నిర్వహిస్తే ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటారని, పనులు త్వరగా పూర్తి చేయించవచ్చని ప్రభుత్వం ఆశించింది. దీనికోసం టెండర్దారుల సాంకేతిక అర్హతలను 50శాతానికి కుదించింది. పనికి టెండర్ల దాఖలుచేసే సంస్థ ఏడాది కాలంలో 1.25కిలోమీటర్ల సొరంగం పనులు, 8వేల క్యూబిక్ మీటర్ల సొరంగం కాంక్రీట్ పనులు చేస్తే చాలని నిబంధనలు సడలించింది. దేశంలో ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది. జూలై 25న రెండోసారి టెండర్లకు ఆహ్వనించారు. ఈనెల 8 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడవుగా నిర్ణయించారు. పని దక్కించుకునేందుకు ఆశించిన మేరకు టెండర్లు దాఖలై ఉంటాయని భావించిన అధికారులు ఊహించని పరిణామం ఎదురైంది. టెండర్ల గడువు ముగిశాక బుధవారం హంద్రీ–నీవా సర్కిల్–3 ఉన్నతాధికారులు టెండర్లు పరిశీలించేందుకు చర్యలు చేపట్టగా అవాక్కయ్యారు. ఆన్లైన్లో ఒక్క టెండరూ దాఖలు కాలేదు. తొలిసారి నిర్వహించిన టెండర్లలో ఒక్క టెండరైనా దాఖలైంది. రెండోసారి టెండర్లకు ఆ సింగిల్ టెండర్ కూడా లేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకోంటామని హాంద్రీ–నీవా సర్కిల్–3 ఎస్ఈ ఆర్.మురళీనాధరెడ్డి గురువారం చెప్పారు. సొరంగం పనులను డిసెంబర్లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని చెప్పారు.


