యాక్సిడెంట్తో బయటపడ్డ అక్రమ నీటి దందా!
సాక్షి, సిటీబ్యూరో: నాగోలు ఠాణా పరిధిలోని జైపురికాలనీ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం గ్రేటర్ హైదరాబాద్లో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని బయటపెట్టింది. బోర్ల ద్వారా జరుగుతున్న నీటి దందాను వెలుగులోకి తెచ్చింది. నగరంతో పాటు మూసీ తీరం వెంట అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా భారీగా బోర్లు వేస్తున్న కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. వాటర్–ల్యాండ్–ట్రీ యాక్ట్ను (వాల్టా చట్టం) అడ్డంగా ఉల్లంఘిస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ప్రతి రోజూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా సంబంధిత విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ అక్రమ నీటి వ్యాపారం ఫలితంగా అనేక కాలనీల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. పట్టుమని పది సంస్థలూ లేవు... గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని కేవలం గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కనీసం ఒక్క ట్యాంకర్ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. ప్లాంట్ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచ్చితంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇలా అనుమతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు కనీసం పది కూడా లేకపోవడం గమనార్హం. భూగర్భ జలాలు పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందల అడుగుల బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా... సాధారణ రోజుల్లో ఈ అక్రమ నీటి దందా పగటి వేళలో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటున్నారు. భారీ పరిణామంలో బోర్లు వేసిన ఈ అక్రమార్కులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనరేటర్లు వినియోగించి మరీ నీటిని తోడేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేసేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ను దాని పరిమాణాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు కొన్ని వందల ట్యాంకర్ల నీరు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటికి ప్రముఖ హోటళ్లు, లాడ్జిలు, అపార్ట్మెంట్స్, హాస్టళ్లకు అమ్మేస్తున్నారు. వినియోగం ఎంత శ్రేయస్కరం...? ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉందని తెలుస్తోంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా వీటి నుంచి వచ్చే నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాలకు సంబంధించిన ఆనవాళ్లూ ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ నీటిని ఖరీదు చేస్తున్న హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు, అపార్ట్మెంట్స్ వాసుల్లో కొందరికి ఈ విషయం తెలిసినా తప్పక ఖరీదు చేస్తున్నారు. ఈ నీటిని తాగడానికి వాడకపోయినా ఇతర అవసరాలకు, హోటల్, లాడ్జిల్లో సరఫరాకి వాడేస్తున్నారు. మరికొందరికి ఈ ట్యాంకర్ డ్రైవర్లు విషయం చెప్పకుండా విక్రయించేస్తున్నారని సమాచారం. వేసవి కాలంలో ఉండే నీటి డిమాండ్ను ఈ బోర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమ దందాలకు మచ్చుతునకలు: ఉప్పల్ మండలంలో మూసీ తీరం వెంట అనేక చోట్ల ఈ అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. అంబర్పేట శ్మశాన వాటికను కూతవేటు దూ రంలోనూ బోర్ల ద్వారా నీటిని తోడేసి ట్యాంకర్ల ద్వారా విక్రయించే దందా నడుస్తోంది. న్యూ మార్కెట్ మెట్రోస్టేషన్ సమీపంలో, ఛే నంబర్ ఫ్లైఓవర్ మార్గంలో, శ్రీనగర్ కాలనీలో జోరుగా సాగుతోంది.చదవండి: ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు పట్టించుకోని సంబంధిత విభాగాలు...అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఈ బోర్ల ద్వారా జరుగుతున్న దందా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా కారణంగా రాజధానిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్ డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఇవి తిరిగే మార్గాల్లో రహదారులు సైతం ఛిద్రం అవుతున్నాయి. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ‘అనుమతులు లేకుండా బోర్లు వేయడం నేరం. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి. అలాంటి బోర్లు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.