breaking news
vizag mp seat
-
చిన్నల్లుడిదే పైచేయి
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో టికెట్ల యుద్ధం మొదలైంది. ఈ జాబితాలో బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్ కూడా చేరిపోయారు. ఈ హైడ్రామాలో చిన్నల్లుడిదే పైచేయి అయింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్, చిన్నల్లుడు, గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీభరత్ పోటీ పడుతూ వచ్చారు. లోకేష్ను తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు టికెట్ ఆశిస్తున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నేత, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతతో చంద్రబాబు.. మీరెవరూ ఆశలు పెట్టుకోకండి. లోకేష్ను పంపిస్తున్నాను.. గెలిపించి పంపండి అని సూచించారు. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో విశాఖ లోక్సభ టికెట్ ఆశిస్తున్న లోకేష్ తోడల్లుడు ఎం.శ్రీభరత్ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజులుగా అమరావతిలో మకాం వేశారు. రెండురోజుల కిందట చంద్రబాబును కలిసి తన టికెట్ గురించి ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు... లోకేష్ వస్తున్నప్పుడు నువ్వు ఎలా పోటీలో ఉంటావు? ఈసారికి వద్దు.. గంటా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయిస్తానని స్పష్టం చేశారు. దీనిపై భరత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నా వద్దని నిరాకరించి ఎంపీగా పోటీ చేసేందుకే తాను సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ కోసం తనను పక్కనపెట్టడాన్ని భరత్ జీర్ణించుకోలేక పోయారు. దీంతో బాలకృష్ణ రంగంలోకి దిగి బావ చంద్రబాబుతో చర్చలు జరిపారు. తొలుత చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. అవసరమైతే భరత్ను రాజమండ్రి ఎంపీగా పంపిస్తానని చెప్పగా ఈ ప్రతిపాదనను భరత్ వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. ఎలాగైనా తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, అవసరమైతే లోకేష్ను కూడా భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించుకోవచ్చని సూచించారు. అయితే ఇందుకు బాబు అంగీకరించలేదు. విశాఖ లోక్సభ, నార్త్, ఈస్ట్ (సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు) ఈ మూడూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించలేమని బాబు వాదించినప్పటికీ భరత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలిసింది. దీంతో బాలకృష్ణ మరోసారి చంద్రబాబుతో మాట్లాడి లోకేష్ను ఎక్కడికైనా పంపించొచ్చు.. భరత్కు విశాఖనే ఇవ్వాలని పట్టుబడినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు చివరికి లోకేష్ను మంగళగిరికి పంపడంతోపాటు శ్రీభరత్కే విశాఖ లోక్సభ టికెట్ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఎంపీ టికెట్ నాదే : భరత్ ‘‘లోకేష్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేసినా నేను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నా. ఇద్దరమూ అక్కడి నుంచి పోటీ చేసినా తప్పు లేదు. టికెట్ నాకే వస్తుందని అనుకుంటున్నా’’ అని భరత్ సాక్షి ప్రతినిధితో స్పష్టం చేశారు. -
విశాఖపై కన్నేసిన చిన్నమ్మ
-
సమైక్య సెగతో ముఖం చాటేసిన కేంద్ర మంత్రులు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సమైక్య నినాదంతో హోరెత్తిస్తున్నారు. కానీ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ప్రజలకు మద్దతు ప్రకటించే ధైర్యం కూడా చేయడం లేదు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా అట్టుడికిపోతున్నా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్లు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. రాజీనామాలు చేయాల్సి వస్తుందని తప్పించుకు తిరుగుతున్నారు. వీరి వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. విశాఖపట్నం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పురందేశ్వరి, అరకు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కిశోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. విశాఖ ఎంపీ టికెట్కు టి.సుబ్బరామిరెడ్డి పోటీకి దిగడంతో తన లోక్సభ నియోజక వర్గం పరిధిలోని ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి పురందేశ్వరి కొంత కాలంగా అడపా దడపా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కిశోర్ చంద్రదేవ్ అరకు ఎంపీగా ఉన్నా ఆయన తన నియోజక వర్గ పరిధిలో పర్యటించిన సందర్భాలు చాలా అరుదు. గత నెల 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో జిల్లాలో సైతం ఉద్యమం ప్రారంభమైంది. ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే డిమాండ్ జనం నుంచి తీవ్రమైంది. ఉద్యమం రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడంతో నియోజక వర్గాలకు వస్తే ఓటర్ల నుంచి ఎదురు దాడికి గురి కావాల్సి వస్తుందనే భయంతో కేంద్ర మంత్రులిద్దరూ ఇటు వైపే రావడం మానేశారు. కిశోర్ చంద్రదేవ్ అయితే తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పురందేశ్వరి ఈ మాట నేరుగా అనక పోయినా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వద్దన్నారని తాను రాసిన రాజీమానా లేఖను ఆయనకు ఇవ్వకుండానే తిరుగుముఖం పట్టారు. లోక్సభలో సమైక్యాంధ్ర గొడవ జరుగుతున్నా పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్ ఇది తమకు సంబంధంలేని వ్యవహారం అన్నట్లుగా వ్యవహరించారు. అధిష్టానం అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కదనే భయంతో ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపేందుకు కూడా ఇష్టపడడం లేదు. కేంద్ర మంత్రుల తీరుపై జిల్లా జనం మండిపడుతున్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎంపీలు జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు కూడా రాకపోవడం దారుణమని ఆగ్రహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొనకుండా ఉద్యమ కారులకు సంఘీభావం తెలపడానికే పరిమితమయ్యారు.