breaking news
Visakhapatnam East Assembly constituency
-
విశాఖ తూర్పులో సామాజిక న్యాయ నినాదం
సాక్షి, విశాఖపట్నం/ఆరిలోవ: విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. ఆ నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను అభివృద్ధి పథంలో నడిపించిన వైనాన్ని వివరిస్తూ శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బస్ యాత్రను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరిలోవ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలతో ప్రారంభమైన యాత్ర.. పులి వేషాలు, డప్పు వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పెదగదిలిలో బీఆర్టీఎస్ మీదుగా జాతీయ రహదారికి చేరుకుంది. అక్కడకు వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు జతకూడాయి. వెంకోజీపాలెం, ఇసుకతోట మీదుగా ఎంవీపీ కాలనీలోని సభా ప్రాంగణానికి యాత్ర చేరుకుంది. ఇక్కడ సభలో అశేష జనవాహిని పాల్గొన్నారు. అడుగడుగునా సీఎం జగన్కు జేజేలు పలికారు. ఈ సాధికారత నభూతో నభవిష్యతి: మంత్రి విశ్వరూప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారత నభూతో నభవిష్యతి అని మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు. రాష్ట్ర కేబినేట్ సహా అన్ని రకాల పదవుల్లో, పథకాల్లో పెద్దపీట వేసి సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలన పొరుగు రాష్ట్రాలకూ దిక్సూచీ అయిందని కొనియాడారు. నిరంతరం పేదోడి బాగోగుల కోసం పరితపించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందరమూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్లగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సుపరిపాలనను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ సీఎం వైఎస్ జగన్ అయితే.. బడుగు బలహీనవర్గాల వారిని హీనంగా చూస్తూ దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో 2.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలో అమలు చేసే పింఛను విధానాన్ని అమలు చేస్తామని బహిరంగంగా ప్రçశంసించారన్నారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తెలంగాణలో అమలు చేస్తామని అక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అనేక సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్గా మారుస్తున్నారని తెలిపారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో పది హార్బర్లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారని చెప్పారు. విశాఖలో హార్బర్ ఆధునీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేశారన్నారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారే తప్ప వారి బాగోగులు చూసిన సందర్భాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవే వర్గాలను అందలం ఎక్కించి, సాధికారతకు తోడ్పడుతున్నారని చెప్పారు. కేబినెట్ సహా అన్ని పదవుల్లో అధిక భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కట్టబెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఒక ఊరులో ఒక జాతి మాత్రమే బాగుండాలంటే చంద్రబాబు కావాలని, అదే ఊరులో అందరూ బాగుండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో బడుగు బలహీన వర్గాల వారికి కీలక పదవులు కల్పించి సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పేదోడు ఆర్థికంగా ఎదగాలన్నా సీఎంగా మళ్లీ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్కుమార్, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ తూర్పులో దొంగ ఓట్ల రగడ
మహారాణిపేట: విశాఖ తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు రగడ సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఇళ్లలో వాస్తవంగా ముగ్గురు, నలుగురు ఉంటే.. 10 నుంచి 15 వరకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉండడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ ఓట్లను తొలగించారు. వాటిని తిరిగి చేర్చాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేర్పించిన దొంగ ఓట్లని, వాటిని తిరిగి జాబితాలో చేర్చవద్దని వైఎస్సార్సీపీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వారే అక్రమంగా జాబితాలో చేర్పించారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వివాదాలు చెలరేగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలుపు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికలకు ముందు వెలగపూడి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల ఆరోపించారు. ఈమేరకు ఆమె కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దొంగ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చవద్దని కలెక్టర్ను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వెలగపూడి స్థానికేతరుడు కావడం వల్ల విజయవాడ, గుంటూరు, గన్నవరం తదితర ప్రాంతాల ప్రజలు, గీతం కాలేజీ విద్యార్థులను ఓటర్ల కింద నమోదు చేశారని ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్పై 20 ఓట్లు ఉంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనవరి నుంచి మార్చి వరకు కనీసం 40,000 ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం నిజమైన విజయం కాదన్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇష్టానుసారం తొలగించేశారు: వెలగపూడి మరోపక్క టీడీపీ ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అక్రమంగా 40,000 ఓట్లు తొలగించారని వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకు 30,000 నుంచి 40,000 ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. తొలగించిన ఓట్లన్నీ తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు.