breaking news
visakhapatnam cyclone warning center
-
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరానికి ఉప్పెన అవకాశం పొంచి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో 790 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ 28న మంగళవారం ఉదయానికి మరింత బలపడి మోంథా తుపానుగా (Cyclone Montha) మారనుంది. మోంథాగా మారిన అనంతరం వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తరువాత ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మోంథా.. తీవ్ర తుపానుగా మారిన సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ., గరిష్టంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని ఈ సమయంలో పెనుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 28న 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 28వ తేదీన తీవ్ర తుపాను తీరం దాటే సమయం కావడంతో రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిలా్లలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 29న 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 29వ తేదీన కూడా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 30వ తేదీన కూడా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాకాసి అలలు విరుచుకుపడతాయ్ కోస్తాంధ్ర తీరమంతటా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖలో ముఖ్యమైన బీచ్ల వద్దకు సందర్శకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 28న మోంథా తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉప్పెనలా ఎగిసి పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరంలో అలలు విరుచుకుపడతాయని.. సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సముద్ర తీరంలో అలలు 2 నుంచి 3.5 మీటర్లు, విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి తీరం వెంబడి 2.1 నుంచి 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడనున్నాయి. తీరం దాటే ప్రాంతంలో అలలు ఉప్పెనలా ఎగిసిపడి తీరం కోతకు గురి చేస్తాయని.. సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోకి నీరు చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ మోంథా విరుచుకుపడనున్న నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ నంబర్–5ని జారీ చేశారు. కళింగపట్నం, వాడరేవు, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను సమాచారం, సహాయక చర్యలు అవసరమైన వారి కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైతే ప్రజలు 112, 1070, 1800–425–0101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. నేడు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్లని నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు చక్రధర్బాబు, విజయనగరం జిల్లాకు రవి సుభాష్, పార్వతీపురం మన్యం జిల్లాకు నారాయణ భరత్గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్జైన్, అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లాలకు వాడ్రేవు వినయ్చంద్, తూర్పుగోదావరికి కె.కన్నబాబు, కాకినాడకు కృష్ణతేజ, కోనసీమకు విజయరామరాజు, పశ్చిమగోదావరికి ప్రసన్న వెంకటేష్, ఏలూరుకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్కుమార్, గుంటూరుకు ఆర్పీ సిసోడియా, బాపట్లకు వేణుగోపాల్రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరుకు యువరాజ్, తిరుపతికి అరుణ్బాబు, చిత్తూరు జిల్లాకు గిరీషాను నియమించారు.శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్జైన్ని నియమించగా.. పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇన్చార్జిగా ఆర్పీ సిసోడియాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.తీరంలో అలజడిఅల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. -
తూర్పు తీరంలో 'యాస్' అలజడి
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాన్ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్కు ఉత్తర వాయువ్య దిశగా 710 కి.మీ, పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 450 కి.మీ, బాలాసోర్కి ఆగ్నేయ దిశగా 550 కి.మీ, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల మధ్య కేంద్రీకృతమైంది. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపాన్గా, 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్గా బలపడనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య చాలా తీవ్రమైన తుపాన్గా మారి బుధవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అతి తీవ్ర తుపాన్గా మారినప్పుడు గంటకు 135 నుంచి 160 కి.మీ. వేగంతో, తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కి.మీ, గరిష్టంగా 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం అలజడిగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. – ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై మాత్రమే కొంత వరకు ఉంటుందని వెల్లడించారు. – శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు మేఘావృత వాతావరణం ఉంటుందని, అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. – ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు, రేపు ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఉత్తరకోస్తా తీరంలో గంటకు 140–160, గరిష్టంగా 185 కి.మీ వేగంతో కోస్తా తీరం వెంట గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. – తీరం వెంట బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. – మత్స్యకారులు ఈ నెల 27వతేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. – విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. – వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. – తుపాన్ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. – గడిచిన 24 గంటల్లో జూపాడు బంగ్లాలో 4 సెంమీ, దర్శి, మర్రిపూడి, చీమకుర్తి, పగిడ్యాల, గుత్తి 3 సెంమీ, ముండ్లమూరు, యర్రగొండ్లపాలెం, వెలిగండ్ల, పొదిలి, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, ఊటుకూరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ తుపాను పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా ముఖ్యమంత్రులతోపాటు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై ప్రభావం స్వల్పంగానే ఉండే అవకాశాలున్నప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. మే 22న కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నిర్వహించిన సమావేశానికి అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం బుధవారం వెల్లడించింది. అది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైందని తెలిపింది. ఆ వాయుగుండం రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15,16 తేదీల్లో నాగపట్నం, చెన్నైల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తాలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.


