breaking news
vijaypal
-
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్పాల్ అరెస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్పాల్ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్పాల్ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 13న విజయ్పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. -
వ్యవ‘సాయం’ భేష్
సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులకు నాంది పలికిందని సాగు వ్యయం, ధరల కమిషన్ (సీఏసీపీ) చైర్మన్ ప్రొఫెసర్ విజయ్పాల్ శర్మ ప్రశంసించారు. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శం, అనుసరణీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఆర్బీకేలు తాను విన్నదాని కంటే మరింత గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే కమిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్ను సందర్శించారు. రైతుల సందేహాలను కాల్ సెంటర్ సిబ్బంది శాస్త్రవేత్తల సహాయంతో ఎలా నివృత్తి చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251కు వస్తున్న కాల్స్ను నిశితంగా గమనించారు. కాల్ చేసిన పలువురు రైతులను కాల్ సెంటర్ సేవల గురించి వాకబు చేశారు. పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న తీరును çపరిశీలించి అభినందించారు. శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్బీకే ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న రైతు ప్రాయోజిత కార్యక్రమాలను స్వయంగా తిలకించారు. చాలా బాగున్నాయంటూ కితాబిచ్చారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారుల సలహాలు, సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను పరిశీలించారు. తమ అనుభవాలను చానల్ ద్వారా తోటి రైతులకు వివరించేందుకు వచ్చిన ఆదర్శ రైతులతో ముచ్చటించారు. రైతు భరోసా మ్యాగ్జైన్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నా ఈ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల్లో కాల్ సెంటర్లు నెలకొల్పితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటూ ఐసీసీ సెంటర్ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందుపరిచారు. గండిగుంట ఆర్బీకే సందర్శన.. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామానికి చేరుకొని ఆర్బీకే –2ను సందర్శించారు. ఆర్బీకే కేంద్రం డిజైన్, సౌకర్యాలను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆరా తీసారు. ఆర్బీకేలో సిద్ధంగా ఉన్న సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను స్వయంగా పరిశీలించారు. కియోస్క్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కియోస్క్ను స్వయంగా ఆపరేట్ చేసి వాతావరణ సమాచారంతో పాటు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో రియల్ టైం మార్కెట్ ధరలను పరిశీలించారు. పంట కొనుగోలు కోసం ఉపయోగించే మాయిశ్చర్ యంత్రం (తేమ పరికరం) ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. పొలంబడి ప్లాట్లను పరిశీలించి పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు పాటిస్తున్న ఉత్తమ యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా పాడి రైతులకు అందిస్తున్న మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలను పరిశీలించారు. ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుబాటులో ఉంచిన ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలను పరిశీలించారు. అనంతరం రైతులను కలుసుకుని ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనే తమకు అన్ని రకాల సేవలు అందుతున్నాయని రైతులు సీఏసీపీ చైర్మన్కు తెలిపారు. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఏది కావాలన్నా మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. సీజన్కు ముందే కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేలోనే అందుబాటులో సిద్ధంగా ఉంచుతున్నారని రైతులు వెల్లడించారు. ఆర్బీకేల వల్ల అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండడంతో రవాణా, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. గతంతో పోలిస్తే తమ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే వరి పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని, ఏటా గోధుమలకు పెంచుతున్న స్థాయిలో వరికి మద్దతు ధరలు పెరగడం లేదని రైతులు సీఏసీపీ చైర్మన్ దృష్టికి తేవడంతో సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అక్కడ నుంచి నేరుగా కంకిపాడులోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ను సందర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సర్టిఫై చేస్తున్న తీరును పరిశీలించారు. నమూనాలు తీసుకొచ్చే రైతుల నుంచి ఏమైనా చార్జి వసూలు చేస్తున్నారా? అని ఆరా తీశారు. అలాంటిదేమి లేదని, రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగానే సర్టిఫై చేసి ఫలితాలను తెలియజేస్తున్నామని సిబ్బంది చెప్పారు. విన్న దానికంటే గొప్పగా ఉన్నాయి: విజయ్పాల్ శర్మ, సీఏసీపీ చైర్మన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆర్బీకేల సేవల గురించి చాలా విన్నా. వాటిని స్వయంగా చూడాలన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చా. నేను విన్న దానికంటే ఆర్బీకేలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను నేనెక్కడా చూడలేదు. ఇలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఆర్బీకేలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కియోస్క్ల ద్వారా వాతావరణ సమాచారం అందిస్తున్నారు. ఆర్బీకే తరహాలో జాతీయ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ తరపున కేంద్రానికి నివేదిక సమర్పిస్తాం. -
మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్నగర్లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్నగర్లో నివసిస్తున్న విజయ్పాల్, సంతోష్ భార్యభర్తలు. విజయ్పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
మూడు కేసుల్లో ముందుకెళ్లని విచారణ
మూడు కేసుల్లో ముందుకెళ్లని విచారణ కేసు నమోదుకే పరిమితమైన పోలీసులు ఇతర సెటిల్మెంట్లలో తలమునకలు వరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు ఎంతో భేష్.. అని ఆ శాఖ ఉన్నతాధికారులు లెక్కలేనన్ని సార్లు కితాబిచ్చి ఉంటారు. మరి... ఆ గౌరవాన్ని మన పోలీసులు నిలబెడుతున్నారా? అంటే కాసింత వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం, కలకలం సృష్టించిన సంఘటనల మిస్టరీని ఛేదించిన వరంగల్ పోలీసులు... ఇటీవల జరిగిన మూడు ఘటనల్లో నిందితులను పట్టుకోవడంలో ముందడుగు వేయలేకపోతుండడం అందుకు ఆస్కారమిస్తోంది. అసలు ఆ కేసులేంటి? పోలీసులు ఏం చేస్తున్నారో? వివరాల్లోకి వెళితే... హన్మకొండ విజయ్పాల్ కాలనీలో ఈ ఏడాది మార్చి ఏడో తేదీన ఓ వివాహిత హత్యకు గురైంది. ప్రాథమిక విచారణలో మాత్రం ఆమె సంబంధీకులే ఈ హత్య చేసుంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతకుమించి ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. అది మే 29. పట్టపగలే హంటర్రోడ్డులోని నందిహిల్స్లో ఓ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. అది కూడా ఆ దొంగలు తాము సీబీసీఈడీ అంటూ సినీఫక్కీలో రూ.50లక్షలు దోచుకెళ్లడం అప్పుడు పెద్ద సంచలనమే సృష్టించింది. అంత పెద్దమొత్తం ఇంట్లో ఉన్న విషయం డబ్బు ఇచ్చిన వారికి, పుచ్చుకున్నవారికి, ఆసమయంలో వారి వెంట ఉన్నవారికి మాత్రమే తెలిసుంటుందనేది పలువురి వాదన. పోలీసులు కూడా అదే వాదనను నిర్ధారించుకున్నప్పటికీ కేసులో నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కీర్తినగర్లోని శ్రీలంకనగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎవరో తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. కానీ, దానివెనుక దాగి ఉన్న అసలు మర్మాన్ని బయటపెట్టడంలో వారు చేసిందేమీ లేదనే చెప్పొచ్చు. మే 18వ తేదీన జరిగిన మర్డర్.. దాదాపు మూడు నెలలవుతోంది. ఈ కేసులో ఆటోడ్రైవర్, పనిమనిషి, వారి దగ్గరి బంధువులను విచారించిన గీసుకొండ పోలీసులు... నిందితులెవరో కనిపెట్టలేకపోయారు. రిస్క్ ఎందుకనీ... అయితే, ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కొందరు అధికారులు జిల్లాకు వచ్చారు. రేపోమాపో ఇక్కడి నుంచి వెళ్లిపోతాం.. మనకెందుకులే.. అని వీరు కేసుల దర్యాప్తుపై పెద్దగా దృష్టిసారించడం లేదని తెలుస్తోంది. తాము వెళ్లిపోయాక కొత్తగా వచ్చేవారు తంటాలు పడతారనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఖాళీగా ఉండడం ఎందుకనీ... సెటిల్మెంట్లలో ఫుల్లుగా మునిగిపోయినట్లు డిపార్ట్మెంటులోనే చర్చసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలను చక్కదిద్దుతూ ఎంతోకొంత వెనకేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా.. కొరుకుడుపడని కేసుల మిస్టరీని ఇట్టే ఛేదించే సత్తా గల పోలీసులుగా పేరున్న జిల్లా పోలీసు శాఖ.. సంచలనం కలిగించిన పై మూడు సంఘటనల్లో నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి సాధించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొత్తవారు వస్తారా? నగరంలో పలువురు సీఐలకు బదిలీల రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మడికొండ, కాజిపేట, సుబేదారి, హన్మకొండ, మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్కాలనీ, కేయూసీ, హసన్పర్తి స్టేషన్ల సీఐలకు దాదాపు పోస్టింగులు కూడా ఖరారైనట్లు చర్చించుకుంటున్నారు.