Vendhar Madhan
-
నన్ను ఇరికించేందుకు కుట్ర: మదన్
సాక్షి, పెరంబూరు: వేందర్ మూవీస్ మదన్ కేసు గత ఎడాది పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని మదన్ సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై ఎస్ఆర్ఎం అధినేత పచ్చముత్తు అసత్య ప్రచారం చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడేందుకే పచ్చముత్తు నా ఆస్తులను విక్రయించి రూ.88 కోట్లు వసూలు చేసినట్టుగా కొత్త నాటకమాడుతున్నారన్నారు. ఆ మొత్తంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మదన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో సీట్లు ఇప్పిస్తానని చెప్పి మదన్ పలువురి వద్ద మదన్ కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించినట్టు నమోదైన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2016 మే 27న కాశీకి వెళ్లి ఆత్మహత్య చేసుకోనున్నట్టు లేఖ రాసి మదన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బునంతా ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అధినేత పచ్చముత్తుకు అప్పగించినట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. దీంతో సెంట్రల్ నేర పరిశోధన పోలీసులు రంగంలోకి దిగి మదన్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పచ్చముత్తు హస్తం ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ అనంతరం విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 91 కోట్లను వారి తల్లిదండ్రులకు తిరిగి చెల్లించనున్నట్లు పచ్చముత్తు చెప్పడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల పాటు పోలీసులు గాలింపు చేపట్టి వేందర్ మూవీస్ మదన్ను తిరుపూర్లో ఆయన ప్రియురాలి ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆయన కూడా బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో పలు కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ) అధికారులు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో గత ఐదేళ్ల కిందట చదివిన విద్యార్థులను విచారిస్తున్నారు. కాగా ఆ మొత్తాన్ని మదన్ నుంచి వసూలు చేసినట్లు పచ్చముత్తు వర్గం ప్రచారం చేస్తోంది. దీన్ని ఖండిస్తూ మదన్ సోమవారం ఉదయం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు పచ్చముత్తును త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం వెలుగులోకి రావడంతో కేసు నుంచి బయటపడేందుకే విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 88 కోట్లను తన ఆస్తులను విక్రయించి వసూలు చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో పచ్చముత్తు ప్రచారం చేయిస్తున్నారని పిర్యాదులో ఆరోపించారు. ఆ డబ్బుకు తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును తాను అప్పుడే పచ్చముత్తుకు అప్పగించానని మదన్ తెలిపారు. ఈడీకి భయపడే తనను ఆ కేసులో ఇరికించడానికి పచ్చముత్తు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. -
సినీ నిర్మాత ఆస్తులు జప్తు
తమిళనాడు: ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడిన కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న వేందర్ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత మదన్కు షాక్ తగిలింది. మదన్కు సంబంధించిన రూ.6.35 కోట్ల స్థిరాస్తులను జప్తు చేయనున్నట్లు ఈడీ అడిషనల్ డైరెక్టర్ కేఎస్వీవీ. ప్రసాద్ శుక్రవారం తెలిపారు. కాగా గత ఏడాది123 మంది వైద్య విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుంచి రూ. 85 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు విచారణ జరిపి పలు ఆధారాలను సేకరించారు. వసూలు చేసిన డబ్బుతో మదన్ పలు బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టు విచారణలో తేలింది. -
సినీ నిర్మాత మోసం కేసులో ట్విస్ట్
చెన్నై(తమిళసినిమా): ఆరు నెలల పాటు చెన్నై పోలీసులను ముప్పతిప్పలు పెట్టి ఎట్టకేలకు వారి వలలో పడ్డ సినీ నిర్మాత వేందర్ మూవీస్ మదన్ను పోలీసులు ఏడు రోజుల పాలు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, ఎగ్మూర్లోని పాత కమిషనర్ కార్యాలయంలో మదన్ను 300 ప్రశ్నలతో విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు బయట పడుతున్నాయి. వైద్య విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుంచి రూ.85 కోట్లు మోసానికి పాల్పడిన మదన్ ఆ డబ్బును ఏమి చేశారు? ఎవరెవరికిచ్చారన్న వివరాలను బయట పెడుతున్నట్లు పోలీసుల సమాచారం. తన ఇద్దరు భార్యాలకు, ఓ నిర్మాతకు, నటుడికి డబ్బు ఇచ్చినట్లు మదన్ చెప్పినట్లు సమాచారం. ఇంకా చాలా ఆస్తులను బినామీల పేర్లపై కూడబెట్టినట్లు చెప్పారట. వారి నుంచి డబ్బును తిరిగి వసూలు చేసి బాధితులకు చెల్లించే చర్యలను పోలీసులు తీసుకోనున్నారు. అదే విధంగా మదన్ మొబైల్ ఫోన్ ద్వారా ఆయనకు 20 మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. వారిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ 123 మంది వద్ద రూ.85 కోట్లు మోసగించిన కేసులో ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న మదన్ను తిరుపూర్లో మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు చెన్నై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఇదిలావుండగా మంగళవారం సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు విచారణ నిమిత్తం మదన్ మొదటి భార్య సింధూజ, రెండో భార్య సుమలతను రప్పించారు. ఆ సమయంలో వర్షా కూడా మూడో భార్యనని తెలిపి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.