breaking news
Vankor
-
వాంకోర్నెఫ్ట్లో ఓవీఎల్ వాటా కొనుగోలు పూర్తి
♦ 15% వాటాను 127కోట్ల డాలర్లకు కొనుగోలు ♦ మరో 11 శాతం వాటా కొనుగోలు! న్యూఢిల్లీ: రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్సీ వాంకోర్నెఫ్ట్ కంపెనీలో ఈ 15% వాటాను ఓఎన్జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్జీసీ విదేశ్కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. వాంకోర్నెఫ్ట్ డెరైక్టర్ల బోర్డ్లో రెండు డెరైక్టర్ల పదవులు ఓఎన్జీసీ విదేశ్కు లభిస్తాయి. 250 కోట్ల బ్యారె ళ్ల రికవరబుల్ రిజర్వ్లు ఉన్న ఈ చమురు క్షేత్రం నుంచి ఓవీఎల్ వాటా కింద ఏడాదికి 33 లక్షల టన్నుల చమురు వస్తుందని అంచనా. ఈ చమురు క్షేత్రంలో రోజుకు 4.42,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోందని, దీంట్లో ఓవీఎల్ వాటా రోజుకు 66 వేల బ్యారెళ్లుగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ వాటా కొనుగోలుతో రష్యాలో ఓవీఎల్ స్థితి మరింతగా పటిష్టమవుతుందని, భారత ఇంధన భద్రత మరింత మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా బలపడుతుందని ఓవీఎల్ పేర్కొంది. మరో 11% వాటాను కూడా విక్రయించడానికి రాస్నెఫ్ట్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు కావలసి ఉంది. -
వాంకోర్లో ఓవీఎల్ వాటా పెంపు!
► ఇప్పటికే 15 శాతం వాటా కొనుగోలు ► మరో రష్యా చమురు క్షేత్రం టాస్లో వాటాలపై ఐవోసీ, ఆయిల్ దృష్టి మాస్కో: రష్యాతో చమురు బంధాలను పటిష్టం చేసుకోవడంపై భారత కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. రష్యాలో రెండో అతిపెద్ద చమురు క్షేత్రం వాంకోర్లో వాటాలు మరింత పెంచుకునేందుకు ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) చర్చలు జరుపుతోంది. అటు, తూర్పు సైబీరియాలోని టాస్-యురియాఖ్ నెఫ్త్గాజొదొబైచా చమురు ప్రాజెక్టులో వాటాలు దక్కించుకునేందుకు ఇండియన్ ఆయిల్ (ఐవోసీ)-ఆయిల్ ఇండియా (ఆయిల్) కసరత్తు చేస్తున్నాయి. వాంకోర్లో తొలుత 25 శాతం వాటాలు కొనుగోలు చేయాలని ఓవీఎల్ భావించింది. అయితే, ఆ క్షేత్ర యాజమాన్య సంస్థ రాస్నెఫ్ట్ 1.26 బిలియన్ డాలర్లకు 15 శాతం వాటాలను అమ్మేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ డీల్కు సంబంధించిన ప్రక్రియలో తొలి దశ పూర్తి కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా ఓవీఎల్, రాస్నెఫ్ట్ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే సమయంలో వాంకోర్లో ఓవీఎల్ వాటాలు పెంచుకునే అంశంపైనా చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వాంకోర్ క్షేత్రంలో 476 మిలియన్ టన్నుల చమురు, 173 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉందని అంచనా. ఇందులో నుంచిరోజుకు 60,000 టన్నుల ఉత్పత్తి నమోద వుతోంది. ఇక, టాస్-యురియాఖ్ ప్రాజెక్టులో వాటాల విక్రయ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాస్నెఫ్ట్తో ఐవోసీ, ఆయిల్ విడిగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. టాస్-యురియాఖ్లో ఐవోసీ-ఆయిల్ 29 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో సుమారు 20 శాతం వాటాలను రాస్నెఫ్ట్ అక్టోబర్లో బ్రిటన్ సంస్థ బీపీకి 750 మిలియన్ డాలర్లకు విక్రయించింది.