breaking news
Vaishakam
-
డైనమిజ(య)ం
తెలుగు పరిశ్రమలో అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరైన బి. జయ గురువారం తుది శ్వాస విడిచారు. 1964 జనవరి 11న జన్మించారామె. చెన్నై యూనివర్శిటీలో యం.ఎ ఇంగ్లీష్, అన్నామలై యూనివర్శిటీలో యం.ఎ సైకాలజీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో డిప్లొమా కూడా సంపాదించారు జయ. 1986లో పాత్రికేయురాలిగా కెరీర్ ఆరంభించి, పలు ప్రముఖ పత్రికల్లో పని చేశారు. మరోవైపు కథలు, నవలలు కూడా రాసేవారు. సుమారు 50కు పైగా షార్ట్ స్టోరీలు, కొన్ని సీరియల్స్, నవల్స్ రాశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్లో 100కు పైగా కార్టూన్స్ వేశారు. ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి నేషనల్ అకాడమీ అవార్డ్ అందుకున్నారు. ‘స్పర్శ’, ‘నీతి’ కథలకు కూడా అవార్డులు దక్కాయి. పాత్రికేయుడు బీఏ రాజుని పెళ్లాడిన అనంతరం ఆరంభించిన ‘సూపర్ హిట్’ పత్రికకు ఎగ్జిక్యూటివ్గా వ్యవహరించారు. డైనమిక్ జర్నలిస్ట్ అనిపించుకున్న జయకు డైరెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. దర్శకురాలు కాకముందు దీపక్, అంకిత జంటగా నటించిన ‘ప్రేమలో పావనీ కల్యాణ్’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. డైరెక్టర్గా జయ ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ (2003). బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్యను హీరోగా, సుహాసినిని హీరోయిన్గా పరిచయం చేస్తూ జయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలి ప్రయత్నంగా 2005లో యువరాజ్, రిషీ గిరీశ్ హీరోలుగా కామ్నా జెఠ్మలానీని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమికులు’. ఆ తర్వాత కమెడియన్ అలీని హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం‘ గుండమ్మగారి మనవడు’. 2008లో ‘సవాల్’, ఆ తర్వాత ఆది సాయికుమార్ హీరోగా, శాన్వీని హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందించిన లవ్స్టోరీ ‘లవ్లీ’. డైరెక్టర్గా బి.జయకు, హీరోగా ఆది సాయికుమార్కు ‘లవ్లీ’ పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘లవ్లీ’ తర్వాత కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘వైశాఖం’ (2017) కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాలను ఆర్జే బ్యానర్పై బీఏ రాజు నిర్మించారు. ‘వైశాఖం’ తర్వాత ‘లక్కీ ఫెల్లో’ పేరుతో జయ, రాజు ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఊహించని విధంగా ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లారు. జర్నలిజమ్ నుంచి సినిమా డైరెక్షన్ వరకూ జయ సాధించిన విజయాలెన్నో. డైనమిక్ జర్నలిస్ట్, డైనమిక్ డైరెక్టర్, డైనమిక్ లేడీ అనిపించుకున్న జయ ఇటు పాత్రికేయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె మరణం తీరని లోటు అని పలువురు పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బి. జయకు ప్రముఖుల నివాళి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరో మహేశ్బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకులు రేలంగి నరసింహారావు, పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్య, కుమారుడు ఆకాశ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటుడు ఉత్తేజ్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కె.ఎస్. రామారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, అనీల్ సుంకర, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), సి.కల్యాణ్, శోభారాణి, రచయితలు చిన్నికృష్ణ, భాస్కర భట్ల, నటీమణులు చార్మీ, హేమ, అపూర్వ, నటి–దర్శకురాలు జీవిత తదితరులు జయకు నివాళులర్పించారు. జయగారు మన మధ్య లేరనేది జీర్ణించుకోలేనిది. చెన్నయ్లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బీఏ రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖల మీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. బీఏ రాజు ఒక మాట అన్నారు.. ‘చనిపోయింది తను కాదు, నేను. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను’ అన్నారు. బాధ అనిపించింది. – నటుడు చిరంజీవి జయ చనిపోవడం బాధగా ఉంది. తను డైరెక్టర్ అవ్వకముందు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. వెరీ హానెస్ట్, ఫ్రాంక్ పర్సన్. ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా చాలా బాగా తీసుకునేది. డైరెక్టర్గా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. – నటుడు వెంకటేశ్ జయగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు పరిశ్రమలోని మహిళా దర్శకుల్లో సావిత్రిగారు, విజయనిర్మలగారి తర్వాత జయగారే. ఆమె 6 సినిమాలు డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. ఆమె రాసిన ‘ఆనందోబ్రహ్మ’ 14 భాషల్లో అనువాదమైంది. ఆవిడలోని మానవీయ కోణం చాలా గొప్పది. – నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి జయగారికి, నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఇద్దరి బర్త్డే ఒకే రోజు (జనవరి 11). ఆవిడ ‘హ్యాపీ బర్త్డే అంటే నేను సేమ్ టు యు’ అనేవాణ్ని. నేను ‘హ్యాపీ బర్త్డే అంటే ఆవిడ సేమ్ టు యు’ అనేవారు. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఫోన్ చేసి విశ్లేషిస్తూ మాట్లాడేవారు. – దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ఇంకా 30 ఏళ్ల తర్వాత వినాల్సిన వార్త ఇంత తొందరగా వినడం చాలా బాధ అనిపించింది. జయ తపన ఉన్న డైరెక్టర్. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే మొన్న హరికృష్ణగారు చనిపోయారు.. ఇప్పుడు జయగారు. బాధ తర్వాత బాధ. – దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విజయనిర్మలగారి తర్వాత ఆమె వారసత్వాన్ని జయగారు కొనసాగిస్తూ ఎంతో మంది మహిళా దర్శకులు రావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చాలా స్ఫూర్తి ఇచ్చారు. అలాంటి జయగారు మన మధ్య లేకపోవడం గొప్ప లోటు. క్రాంతికుమార్గారి వద్ద నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు తను కలిదిండి జయ పేరుతో కథలు, పుస్తకాలు రాసేవారు. అవి ఆయనకు బాగా నచ్చేవి. అప్పుడే ఆమె అంటే నాకు అభిమానం ఏర్పడింది. – దర్శకుడు గుణశేఖర్ బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు జయగారు. ఆమెతో మాది 30 ఏళ్ల అనుబంధం. పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉన్న గొప్ప టెక్నీషియన్. విజయనిర్మలగారి తర్వాత ఆ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కుతారేమో అనేంత పట్టుదల ఉన్న జయగారు సడెన్గా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. రాజుగారికి తీరని లోటు ఇది. – నిర్మాత అచ్చిరెడ్డి జయగారు నా సినిమాలు చూసి ఎప్పటికప్పుడు అభినందించేవారు.. చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావు.. ఇంకా మంచి సినిమాలు తీయాలి అంటూ ప్రోత్సహించేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్. – డైరెక్టర్ నందినీరెడ్డి జయ మేడమ్కి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. రోజూ వాకింగ్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు. నాకు ఆవిడ తల్లిలాంటిది. నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ డైరెక్టర్ ఆవిడ. ఆ చిత్రం టైమ్లో నేను చాలా చిన్నమ్మాయిని. నన్ను కూతురిలా చూసుకున్నారు. – నటి సుహాసిని జయగారు ‘లవ్లీ’ సినిమాతో నాకు మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, మంచి సినిమాలు చేయాలి, హిట్ కొట్టాలని ఎంకరేజ్ చేసేవారు. – నటుడు ఆది హరికృష్ణను చివరిసారి చూడాలనుకున్నారు కొద్ది రోజులుగా హాస్పిటల్లో ఉంటున్న జయ బుధవారం హరికృష్ణ మరణ వార్త విని షాకయ్యారు. ఆయన్ను కడసారి చూడాలనుకున్నారు. ఆమె తెరకెక్కించిన ‘చంటిగాడు’ చిత్రం ఓపెనింగ్కి గెస్ట్గా హరికృష్ణ వచ్చారు. ‘‘వేడుక 9 గంటలకు అంటే ఆయన 8.30కి వచ్చారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, సినిమా సక్సెస్ కావాలని అభినందించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించాలనుకున్నారు జయ. అయితే ఆరోగ్య సమస్యల రీత్యా కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని పరామర్శిద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందడం విచారకరం’’ అని బీఏ రాజు ఉద్వేగానికి గురయ్యారు. బీఏ రాజు, చిరంజీవి, వెంకటేశ్, మహేశ్బాబు... -
జయకు మహేష్ బాబు నివాళి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్తో పాటు సీనియర్ హీరో వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గుణశేఖర్ తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకురాలు మృతి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ దర్శకురాలు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్గా పనిచేశారు. అనంతరం చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్ క్రౌన్ అవార్డ్ను అందుకున్నారు. -
సూపర్ హిట్ జర్నీ
పాత్రికేయుడిగా, ‘సూపర్హిట్’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా బీఏ రాజు జర్నీ సక్సెస్ఫుల్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా విశేషాలను తెలియజేశారు. ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు మరో సినిమా నిర్మించనున్నారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మా బేనర్లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతేడాది నిర్మించిన ‘వైశాఖం’ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టాం. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్లో ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. -
సరికొత్త వైశాఖం
-
‘వైశాఖం’ సీడీ రిలీజ్ చేసి మహేశ్బాబు
-
తర్వాతి సినిమాలోనూ అతనే హీరో!
హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘నాకు బాగా దగ్గరయిన కథ ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా సినిమాలో నవరసాలు ఉన్నాయి. హరీశ్ న్యాచురల్ పెర్ఫార్మర్’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాం. యూత్, ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఆగస్టు, సెప్టెంబర్లలో జరిగే షెడ్యూళ్లతో షూటింగ్ పూర్తవుతుంది. మా సంస్థ తదుపరి సినిమాలో కూడా హరీశ్ని హీరోగా తీసుకున్నాం’’ అన్నారు. ‘‘రెండు మూడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఉపయోగించిన స్పైడర్ క్యామ్ను ఈ సినిమాకి ఉపయో గిస్తున్నాం’’ అని సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
బి. జయ దర్శకత్వంలో వైశాఖం
‘‘ఈ ఏడాది మా ఆర్.జె. సంస్థ పతాకంపై బి. జయ దర్శకత్వంలో ‘వైశాఖం’ సినిమా నిర్మించనున్నా. ‘లవ్లీ’ తర్వాత మళ్లీ మరో మంచి చిత్రం తీయాలనే ఆకాంక్షతోనే ఇంత కాలం గ్యాప్ తీసుకున్నాం. మంచి ఫీల్ని కలిగించే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇకనుంచి రెగ్యులర్గా సినిమాలు నిర్మించాలనే ప్లాన్లో ఉన్నాం. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో కూడా సినిమాలు తీయనున్నాం’’ అని బీఏ రాజు తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘సినిమా పరిశ్రమ మీద మక్కువతో చాలా చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేశాను. పాత్రికేయుడిగా, ‘సూపర్ హిట్’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా నా ప్రయాణం సంతృప్తికరంగా ఉంది. ఒకప్పుడు డెరైక్షన్ చేయాలనుకునేవాణ్ణి. కానీ, జయ డెరైక్టర్ అయిన తర్వాత సినిమా దర్శకత్వం అంటే.. పేరు వేసుకున్నంత సులువు కాదని తెలిసి, విరమించుకున్నాను. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడం, చెప్పిన బడ్జెట్లో తీయడంలో జయ బెస్ట్’’ అని చెప్పారు. బి. జయ మాట్లాడుతూ - ‘‘నేను తీసే సినిమాలు ఓ రిఫరెన్స్లా మిగిలిపోవాలని నా కోరిక. ‘లవ్లీ’ సినిమాని అలానే తీశాను. ఆ చిత్రం ఇతర భాషల్లో అనువాదమై, అక్కడ కూడా విజయం సాధించింది. ‘వైశాఖం’ కూడా మంచి కథతో తీయనున్నాం’’ అని చెప్పారు.