-
పీఎన్బీ కేసులో మాజీ ఎండీకి షాక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్ను కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న ఉషా పదవీ కాలం సోమవారంతో ముగియగా అదేరోజున కేంద్రం ఈ ఉత్తర్వులు వెలువరించటం గమనార్హం. ఉషాతో పాటు పీఎన్బీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ శరణ్ను విచారించేందుకు సీబీఐకి అనుమతిని కూడా కేంద్రం మంజూరు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉషా అనంతసుబ్రమణియన్ గతంలో రెండు దఫాలుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సారథ్యం వహించారు. 2011 జూలై నుంచి 2013 నవంబర్ దాకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను, 2015 ఆగస్టు నుంచి 2017 మే దాకా ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. నీరవ్ మోదీ స్కామ్ ప్రారంభమైనది కూడా దాదాపు ఆ సమయంలోనే. కొన్నాళ్లుగా ఉషా అనంతసుబ్రమణియన్ అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే స్కామ్ దరిమిలా ఆమె అధికారాలకు బ్యాంకు కత్తెర వేసింది. సీబీఐ చార్జిషీటులో ఉషాతో పాటు ఇద్దరు మాజీ ఈడీలైన బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్ పేర్లు ఉన్నాయి. ఆమెతో పాటు ఇతర సీనియర్ బ్యాంక్ అధికారులకు అక్రమ లావాదేవీల గురించి తెలిసినప్పటికీ.. వారు దిద్దుబాటు చర్యలేమీ తీసుకోలేదని అభియోగాలున్నాయి. -
అలహాబాద్ బ్యాంక్ సీఈవోను ప్రశ్నించిన సీబీఐ
పీఎన్బీ కుంభకోణానికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ను సీబీఐ మంగళవారం ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కి చీఫ్గా ఎన్నికైన ఉష.. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సీనియర్ స్థానాల్లో కూడా పనిచేశారు. 2015 ఆగస్టు 14 దాకా ఆమె పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత 2017 మే 6న అలహాబాద్ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. తాజా కేసులో ఆమెను నిందితురాలిగా ప్రశ్నించడం లేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. బ్యాంకు పర్యవేక్షణ వ్యవస్థ కన్నుగప్పి.. ఇంత భారీ లావాదేవీలు ఎలా చోటుచేసుకున్నాయి, ఇలాంటి వాటి గురించి ఆడిటర్లు ఎప్పుడైనా తమ నివేదికల్లో హెచ్చరికల్లాంటివేమైనా చేశారా లేదా అనే అంశాలపై స్పష్టత కోసం ఉషను ప్రశ్నిస్తున్నట్లు వివరించాయి. గీతాంజలి జెమ్స్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్.. గీతాంజలి జెమ్స్ మోసానికి పాల్పడిందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు సంస్థ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇందుకోసం టీఆర్ చద్ధా అండ్ కంపెనీని నియమించుకున్నాయి. ఆడిట్ పలితాలను బట్టి ఈ ఖాతాను ప్రామాణికమైనదిగానో లేదా మొండిపద్దుగానో పరిగణించడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయి. -
ఏ రంగమైనా..రాణించే సత్తా మహిళల సొంతం
గెస్ట్కాలమ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్గా బ్యాంకింగ్ కెరీర్ ప్రస్థానం ప్రారంభించి.. దేశంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకు చైర్ పర్సన్ స్థాయికి ఎదిగారు ఉషా అనంత సుబ్రమణియన్. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకునే మార్గాలు తెలియక వంటింటికే పరిమితమయ్యే మహిళలు ఎందరో! అలాంటి మహిళల్లో సాధికారత, స్వావలంబన కల్పించడం.. విద్యార్థినులకు కెరీర్పరంగా చేయూతనందించడమే భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) ప్రధాన లక్ష్యాలు అంటున్న ఉషా అనంత సుబ్రమణియన్తో ఇంటర్వ్యూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాంకుకు తొలి చైర్పర్సన్గా ఎంపికవడంపై మీ స్పందన? ఒక విధంగా ఇది సవాల్. అయితే, నాకు గత 30 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలోనే పలు హోదాలు నిర్వర్తించిన అనుభవం ఉంది. మహిళా బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన కమిటీలోనూ నేను మెంబర్గా ఉన్నా. దాంతో బ్యాంకు విధి విధానాలపైనా అవగాహన వచ్చింది. ఇవన్నీ ప్రస్తుత బాధ్యతలకు న్యాయం చేయడంలో దోహదపడతాయనే విశ్వాసముంది. భారతీయ మహిళా బ్యాంకు లక్ష్యాలు? ప్రధానంగా మహిళలు, విద్యార్థినుల్లో స్వావలంబన, సాధికారత కల్పించడం ఈ బ్యాంకు ప్రధానోద్దేశం. ఇందుకోసం తొలిరోజు నుంచే మహిళలకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటికే ఏర్పాటైన బ్రాంచ్ల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇదే స్ఫూర్తితో త్వరలోనే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్లు ప్రారంభిస్తాం. దేశంలోని అన్ని ప్రాంతాల మహిళలకు చేరువయ్యేలా అడుగులు వేస్తాం. విద్యార్థినులకు ఉన్నత విద్య పరంగా మహిళా బ్యాంకు నుంచి లభించే చేయూత? విద్యార్థినులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు.. బీఎంబీ సరస్వతీ లోన్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ స్కీం ప్రకారం.. భారత్లో ఉన్నత విద్యకు గరిష్టంగా రూ.10లక్షల వరకు.. విదేశీ విద్యకు గరిష్టంగా రూ.20 లక్షల రుణ సదుపాయాన్ని అందజేస్తాం. రూ.4 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేకుండానే అందిస్తాం. వడ్డీ రేట్ల విషయంలోనూ విద్యార్థినులకు ఒక శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నాం. మహిళల్లో స్వయం ఉపాధి దిశగా ఎలాంటి ప్రోత్సాహకాలు అందించనున్నారు? మహిళలకు, వారి అర్హతలు, వారు ఎంచుకున్న స్వయం ఉపాధి మార్గాలకు అనుగుణంగా పలు రుణ పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. మహిళలు మాత్రమే నిర్వహించగల ‘డే కేర్’.. ‘బ్యూటీ కేర్’ సెంటర్ ఏర్పాటు నుంచి.. అత్యున్నత ప్రొఫెషనల్ కోర్సులుగా పేరుగడించిన సీఏ, సీఎస్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి.. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే వారి వరకూ.. పలు రుణ సదుపాయాలు అందచేయనున్నాం. వీటితోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, స్వయం సహాయ బృందాలకు వేర్వేరుగా ప్రత్యేక రుణ పథకాలు రూపొందించాం. కేవలం రుణ పథకాలను ప్రారంభించడంతో సరిపెట్టకుండా.. వాటిని అర్హులైన వారికి అందించే విధంగా స్వీయ లక్ష్యాలు నిర్దేశించుకొని.. తద్వారా మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తున్నాం. అకడెమిక్గా విద్యార్థినులు నేటికీ కొంత వెనుకంజలో ఉన్నారని.. లింగ వివక్షత ఇప్పటికీ కొనసాగుతోందనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఇది కొంతమేర వాస్తవమైనప్పటికీ.. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో పరిస్థితిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రతి రంగంలో మహిళల నిష్పత్తి పెరుగుతోంది. నూటికి దాదాపు 40శాతం మంది మహిళలు ప్రతి రంగంలో స్థానం సంపాదించుకుంటున్నారు. ఇది విద్యారంగం నుంచి ఉద్యోగాల వరకూ అన్ని చోట్లా ప్రస్ఫుటమవుతోంది. కెరీర్ పరంగా ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంలో మహిళలకు గల అవకాశాలు? మహిళలకు చక్కటి కెరీర్ సోపానం బ్యాంకింగ్ రంగం. కూల్ అండ్ కంఫర్ట్ జాబ్ అని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభించాక.. స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలున్నప్పటికీ.. ప్రమోషన్లు విషయంలో అమలయ్యే కొన్ని విధానాల కారణంగా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. భారతీయ మహిళా బ్యాంకులో ఖాళీలన్నీ మహిళలతోనే భర్తీ చేస్తారా? అలాంటి నిబంధన లేదు. అధిక శాతం మంది మహిళా సిబ్బంది ఉండేలా యత్నిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 60 బ్రాంచ్లు ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఇందుకోసం 600 మంది సిబ్బందిని నియమిస్తాం. ఇందులో 400 ఖాళీలను డిప్యుటేషన్ విధానంలో.. 200 ఖాళీలను డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టనున్నాం. భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగ నియామకాలు ఎలా ఉండనున్నాయి? ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సమీప భవిష్యత్తులో వేల అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రతి బ్యాంకు.. ఆధునికీకరణ, శాఖల విస్తరణ కార్యకలాపాలు చేపడుతోంది. దాంతో రానున్న అయిదారేళ్లలో వేల సంఖ్యలో ఖాళీల భర్తీ జరగనుంది. మరోవైపు మరికొన్ని ప్రైవేటు బ్యాంకులకు కూడా అనుమతులిచ్చే అవకాశముంది. కాబట్టి అటు ప్రైవేటు రంగంలోనూ బ్యాంకుల్లో పలు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మీ అభిప్రాయంలో నేటి విద్యార్థినులకు అనుకూలించే రంగం? ప్రస్తుతం ఏ రంగంలోనైనా మహిళలు దూసుకెళ్తున్నారు. కారణం.. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని సాధనాలుగా చేసుకుంటే నేటి తరం విద్యార్థినులు భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. అయితే చాలామంది మహిళల్లో లోపిస్తున్న లక్షణం ‘మొబిలిటీ’(స్థాన చలనం) లేకపోవడం. ఫలితంగా మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకుంటున్నారు. దీనికి మన కుటుంబ సంస్కృతి కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కాబట్టి మహిళల అభివృద్ధి విషయంలో కుటుంబ స్థాయిలోనే తోడ్పాటుకు పునాది పడితే.. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. కెరీర్ ఎంపికలో విద్యార్థినులు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? మన దేశంలో విద్యార్థినులు ఇప్పటికీ కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు, ఇతరుల సలహాలపైనే ఆధారపడుతున్నారు. దాంతో కొంతకాలం గడిచాక ఆ రంగంలో ఆసక్తి తగ్గిపోయి.. యాంత్రికంగా వ్యవహరిస్తూ కెరీర్ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. మన సమాజంలో మహిళలు ఆశించిన స్థాయిలో ఉన్నతస్థానాల్లో లేకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. నా అభిప్రాయంలో.. ఆసక్తి, అభిరుచుల మేరకే కెరీర్ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే విజయాలు సాధించగలరు. పురుషులు సైతం క్లిష్టంగా భావించే వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ, ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తమ ఆసక్తికి అనుగుణంగా కెరీర్ ఎంపిక చేసుకోవాలి. మహిళా విద్యార్థులకు మీరిచ్చే సూచన? ప్రస్తుతం దేశంలో మహిళలకు ఎన్నో రకాలుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. పాఠశాల స్థాయిలో స్కాలర్షిప్లు మొదలు పీహెచ్డీ ఫెలోషిప్స్ వరకూ.. మహిళలకు ఎన్నో విధాలుగా ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా లింగ సమానత్వం(జెండర్ ఈక్వాలిటీ) దిశగా అన్ని వర్గాలు కృషి చేస్తున్న తరుణంలో ప్రైవేటు రంగం నుంచి కూడా అనేక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ‘మనకు సాధ్యం కాదు’ అనే సనాతన భావన వీడితే సమున్నత స్థానాలు సొంతం చేసుకోవడం ఖాయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement