breaking news
unqualified faculty
-
ఇదీ సంగతి: అర్హతలేని అధ్యాపకులు... అనుభవం లేని ప్రిన్సిపాళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 90 శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని గుర్తించినట్లు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ–హెచ్) వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కాలేజీలకు ఈసారి గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనల అమలు కచ్చితంగా పాటించడం సాధ్యం కాదని, ఈసారికి మినహాయింపు ఇవ్వాలంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ–హెచ్ అఫిలియేషన్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయితేనే ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. కమిటీ తేల్చిందేంటి? రాష్ట్రవ్యాప్తంగా 148 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 955 కోర్సులను నిర్వహిస్తున్నారు. 2021–22 లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో 89,400 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వాటన్నింటికీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ–హెచ్ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్థితిగతులు తెలుసుకొనేందుకు ఎంసెట్ నిర్వహణకు ముందే జేఎన్టీయూ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలను సేకరించింది. జేఎన్టీయూ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయాలు ఇవీ... ►రాష్ట్రంలోని 90 శాతం కాలేజీల్లో మౌలిక వసతుల లేమి కనిపించింది. సీఎస్ఈ కోర్సులకు కీలకమైన ఆధునిక కంప్యూటర్లు లేవు. అవసరమైన సాఫ్ట్వేర్ సైతం అందుబాటులో లేదు. కొన్ని కాలేజీల్లో ఇంకా కాలం చెల్లిన కంప్యూటర్లే కనిపించాయి. ►అనుభవం లేని అధ్యాపకులు, అర్హతల్లేని ప్రిన్సిపాళ్లతో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ►చాలా కాలేజీలు అధికారికంగా చూపించే ఫ్యాకల్టీ అధ్యాపకులు కనిపించలేదు. ►దాదాపు ఐదేళ్లుగా పేరున్న ఒక్క కంపెనీ కూడా ఆయా కాలేజీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిన దాఖలాల్లేవు. ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి... ►కాలేజీ ప్రిన్సిపాల్ పీహెచ్డీ చేసి ఉండాలి. కనీసం 15 ఏళ్ల అధ్యాపక అనుభవం కలిగి ఉండాలి. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శిగా పనిచేసి ఉండాలి. ►సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు తప్పనిసరిగా పీహెచ్డీ చేసి ఉండాలి. ఇది లేనప్పుడు నెట్, స్లెట్.. ఏదో ఒకటి చేసుండాలి. ►కాలేజీలు ఎంపిక చేసే అధ్యాపకులను అఫిలియేషన్ ఇచ్చే యూనివర్సిటీ పరిశీలించి, ఆమోదించాలి. బోధించే అర్హతలున్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే గుర్తింపు ఇవ్వాలి. -
జేఎన్ఏఎఫ్ఏయూలో కొనసాగుతున్న విద్యార్ధుల ఆందోళన
మాసబ్ ట్యాంక్ వద్ద గల జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో అనర్హులైన ఫ్యాకల్టీని తొలగించాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన 19వ రోజుకు చేరుకుంది. బుధవారం వర్సిటీ ఆవరణలో టెంట్వేసి విద్యార్థులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఫ్యాకల్టీ కన్నా గూగుల్, యూట్యూబ్ మిన్న అంటూ నినాదాలు చేశారు. యూనివర్శిటీ యాజమాన్యం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పుడున్న యానిమేషన్ ఫ్యాకల్టీని తొలగించి అనుభవం ఉన్న వారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ పద్మావతి మాట్లాడుతూ.. విచారణ కమిటీ నివేదిక చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల అందోళన నేపథ్యంలో ఈ నెల 31వరకు (10 రోజులు) సెలవు ప్రకటించినట్లు తెలిపారు.