కాంగ్రెస్వి కాకిలెక్కలు
గిరిజనేతరులు పోడు చేస్తే పీడీ యాక్టు
రెండు, మూడు ఎకరాలు సాగుచేస్తే గిరిజనులను వేధించొద్దు
ఎంపీ సీతారాం నాయక్
ఇల్లెందు: ప్రతి పక్ష కాంగ్రెస్ కాకి లెక్కల పవర్ ప్రజెంటేషన్ చేసి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే యత్నం తగదని మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ అన్నారు. గురువారం ఇల్లెందులో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కోటి ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వగా, కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాకి లెక్కల పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అభూత కల్పనలను దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ప్రజా వేదిక, బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. గోదావరి నీటిని వినియోగించడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దళితుల రక్షణ కోసం చట్టాలు ఉన్నా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో రూ.30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజనుల సాగులో ఉన్న రెండు, మూడు ఎకరాల పోడు భూములు లాక్కొని మొక్కలు నాటడం తగదన్నారు. గిరిజనేతరులు పోడు చేస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వమే సూచించిందన్నారు. అటవీ శాఖ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఈ విషయమై జిల్లా సమావేశంలో తాము అటవీ శాఖను ప్రశ్నిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్ జానీ పాషా, టీఆర్ఎస్ నేతలు చిలువేరు సత్యనారాయణ, భావ్సింగ్ నాయక్, మండల రాము, సోదపాక సత్యనారాయణ, మెరుగు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.