breaking news
Union Minister Ashok gajapatiraju
-
అశోక్ గజపతి రాజుకు విమానంలో చుక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు విమానంలో ప్రయాణీకులు చుక్కలు చూపించారు. గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తూ చిరాకు పెట్టించారు. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన తమ విమానం గంటపాటు ఎందుకు ఆలస్యం అయిందని, ఎందుకు అంతసేపు తమను విమానంలో కూర్చొబెట్టారని నిలదీశారు. దాంతో ఆయన వెంటనే ఎయిర్ ఇండియా చైర్మన్కు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేసి వెంటనే జరిగిన తప్పిదానికి వివరణ కోరారు. వివరాల్లోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. అదే విమానంలో మంత్రి అశోక్ గజపతి రాజుతోపాటు మొత్తం 125మంది ప్రయాణీకులు కూర్చున్నారు. గంట సేపు అయినా పైలట్, ఇతర సిబ్బంది రాలేదు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రయాణీకులు అందులో ఉన్న విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజును ప్రశ్నలతో చుట్టుముట్టారు. దీనికి బదులుగా ఎయిర్ ఇండియా వెంటనే పైలట్తో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎయిర్ లైన్ అధికారిక ప్రతినిధి జీపీ రావ్ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియా 459 విమానం గంటన్నరపాటు ఆలస్యం అయింది. -
కన్నుల పండువగా పైడితల్లమ్మ సిరిమానోత్సవం
♦ జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన విజయనగరం ♦ దాదాపు 3 లక్షల మంది హాజరు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. జై పైడిమాంబ నినాదాలతో విజయనగరం పట్టణం మార్మోగింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా సిరిమానుపై పూజారి రూపంలో ఉన్న అమ్మవారు ఊరేగారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అధిరోహించిన సిరిమాను.. సాయంత్రం 4.28 గంటలకు విజయనగరంలోని అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమైంది. అంజలిరథం, పాలధార, తెల్ల ఏనుగు, జాలరి వల తదితర ఆధ్యాత్మిక ఘట్టాల వెంట సిరిమానోత్సవం సాగింది. మహరాజ కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది. మధ్యాహ్నం 3.35గంటలకు ప్రారంభం కావల్సిన సిరిమానోత్సవం.. ఆలస్యంగా 4.28గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటల సమయంలో ముగిసింది. మహరాజ కోట బురుజుపై నుంచి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దంపతులు ఉత్సవాన్ని వీక్షించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో విజయనగరం జనసంద్రమైంది. అడుగు వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. సిరిమానోత్సవానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఆశావహుల్లో తొలగని టెన్షన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరికి కేటాయించేది అన్న విషయం తేలిపోతుందని భావించిన ఆశావహులకు నిరాశే మిగిలింది. అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విషయమై అధినేత చంద్రబాబు కనీసం మాట్లాడ లేదు. గురువారం జరిగే సమవేశానికి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికపైనే చంద్రబాబు చర్చిస్తారని అంతా భావించారు. ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ సీఎం చర్చించారు. అయితే అధినేత సూచన మేరకు ఆశావహులతో ముగ్గురు మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వేరేపార్టీ నుంచి వచ్చిన వారికి నోఛాన్స్ అని అక్కడికక్కడే సంకేతాలిచ్చారు. అలాగే నెల్లిమర్ల సత్యం పేరు కూడా పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఆశావహులు టెన్షన్తో ఉండక తప్పదు. అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశావహులతో పాటు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి హైదరాబాద్ వెళ్లారు. గురువారం సాయంత్రం 6.30గంటల తర్వాత జిల్లా నేతల సమావేశం ప్రారంభమయింది. అధినేత ఇచ్చిన డెరైక్షన్తో ముందుగా జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలతో మంత్రులు అశోక్ గజపతిరాజు, పల్లె, మృణాళిని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరికి టిక్కెట ఇస్తే బాగుంటుందని అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అంతా ‘ మీ నిర్ణయమే మా నిర్ణయం’ అని మంత్రులకే వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మాత్రం తన తల్లి శోభా హైమావతికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. పార్టీకి సుదీర్ఘంగా అందించిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, టిక్కెట్ ఆశావహులతో మం త్రులు సమావేశమయ్యారు. టిక్కెట్ ఆశిస్తున్నవారి జాబితా చాలా పెద్దదిగా ఉండడంతో కాసింత ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో పార్టీలు మారిన వారిని నో ఛాన్స్ అని చెప్పేశారు. దీంతో గద్దే బాబూరావు, కొండపల్లి కొండలరావు ఆశావహుల జాబితాలోంచి తప్పించినట్టయింది.సమావేశం ముగి శాక ఆశావహులతో మంత్రులు విడివిడిగా భేటీ అయ్యారు. శోభా హైమావతి, ద్వారపురెడ్డి జగదీష్, తెంటు ల క్ష్ముంనాయుడు, గద్దే బాబూరావు, కె.త్రిమూర్తులరాజు, ఐవీపీ రాజు, భంజ్దేవ్, మహంతి చిన్నంనాయుడు, తూముల భాస్కరరావు, కరణం శివరామకృష్ణ, కొండపల్లి కొండలరావుతో వేర్వేరుగా మాట్లాడారు. తమకు టిక్కెట్ ఇవ్వవల్సిన ఆవశ్యకతను, తన అభిప్రాయాలను వారు వెల్లడించారు. వీరితో భేటీ ముగి సాక జిల్లా నేతలందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కనీసం మాట్లాడలేదు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ భూసేకరణ ఎలా చేయాలన్నదానిపై చర్చించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో బొత్స చేరికపైనా, వైఎస్సార్సీపీలో ప్రస్తుతం ఉన్న నేతల పరిస్థితిపైనా ప్రధానంగా ఆరాతీశారు. ఎమ్మెల్సీ టిక్కె ట్ ఊసెత్తకుండా సమావేశాన్ని ముగించేశారు. మంత్రులకు మాత్రం శుక్రవారం కలవాలని ఆదేశించారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని వెళ్లిన ఆశావహులంతా నిరాశతో వెనుదిరిగారు.