unemployers
-
రిటైర్మెంట్లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మంగళవారం 25 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు అన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020లో దీన్ని 60 ఏళ్లకు పెంచారు. కొత్తగా పోస్టుల భర్తీకి అవకాశం లేని దృష్ట్యా, 58 ఏళ్లు నిండిన వాళ్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధుల్లో కొనసాగుతూ వచ్చిన నగరాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్య, వైద్య తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు రెండేళ్ల పాటుగా విధుల్లో కొనసాగారు. వీరందరి పదవీ కాలం మే 31(మంగళవారం)తో ముగిసింది. దీంతో ఈ ఒకే రోజున రికార్డు స్థాయిలో 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఇక, వీరికి పదవీ విరమణ నిధి కేటాయింపు కోసం రూ. ఐదు వేల కోట్ల మేరకు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో లక్షా 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా పదవీ విరమణతో ఆ సంఖ్య లక్షా 75 వేలకు చేరినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీ కండెక్టర్లు, డ్రైవర్లు తదితర పోస్టులను ఇది వరకు రవాణాశాఖ భర్తీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీకి తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు టీఎన్పీఎస్సీ మంగళవారం ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. అయితే, కండెక్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది నియమకానికి టీఎన్పీఎస్సీకి అవకాశాలు ఉన్నా, డ్రైవర్ల ఎంపిక మాత్రం కొంత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. డ్రైవర్ల ఎంపిక రాత పరీక్ష, ఇతర అర్హతల మీద కన్నా, అనుభవం ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ దృష్ట్యా, డ్రైవర్ల ఎంపికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని టీఎన్పీఎస్సీ కోరినట్లు సమాచారం. -
ప్రతి గంటకూ ఓ నిరుద్యోగి బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఆర్సీబీ నివేదిక ప్రకారం 2018లో 12,936 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే అధికం కావడం గమనార్హం. ఇక 2017లోనూ అదే ఏడాది రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని నివేదిక తెలిపింది. 2018లో ప్రతి గంటకూ ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడినట్టు ఎన్ఆర్సీబీ గణాంకాంలు వెల్లడించాయి. ఆ ఏడాది జరిగిన 1,34,516 ఆత్మహత్యల్లో 9.6 శాతం నిరుద్యోగులవేనని తేలింది. అదే ఏడాది మొత్తం బలవన్మరణాల్లో 10,349 మంది రైతు ఆత్మహత్యలు కాగా ఇవి మొత్తం మరణాల్లో 7.7 శాతంగా నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల్లో 10,687 మంది పురుషులు కాగా, 2249 మంది స్త్రీలుగా గుర్తించారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ ఆత్మహత్యల్లోనూ 12.3 శాతంతో ముందువరుసలో నిలిచింది. ఇక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. -
నిరుద్యోగులకు వరం
సాక్షి,కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, బీ టెక్, ఎం టెక్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి వరం లాంటిది నవ గురుకుల్ సంస్థ. ప్రతిభగల కొంతమంది ఐటీ తదితర సంస్థల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారు ఇలాంటి సంస్థల్లో ఉపాధి పొందాలంటే ఉన్నత చదువులు ఉంటేనే కొలువులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సీ డ్యాప్ సంస్థ ద్వారా నవ గురుకుల్ అనే సంస్థను ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. ఈ సంస్థ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఆంగ్లంపై పట్టు ఉన్న వారికి సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నత కొలువులు రానున్నాయి. జిల్లాలో ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువత ఉన్నత కొలువులు లేక చాలీచాలని జీతాలతో ఇబ్బందులుపడుతున్నారు. ఎన్నాళ్లు పని చేసినా జీతం తక్కువ రావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 18–23 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు బంగారు భవిష్యత్ కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు నవ గురుకుల్ అనే సంస్థను ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. సీ డ్యాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఏజెన్సీ) ద్వారా జిల్లాలో ఎంపికలు నిర్వహించి నైపుణ్యం, క్రమశిక్షణ ఉన్న వారిని ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది దేశంలో 150 మంది యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 50 మందికి అవకాశం కల్పించారు. తొలి దశలోనే జిల్లాకు 10 సీట్లు కేటాయించడంతో నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు. నిరుద్యోగులకు సువర్ణావకాశం సీ డ్యాప్ సంస్థ ద్వారా నిర్వహించే ఎంపికల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తోంది. 18–23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ చదివిన వారికి అవకాశం. ముందుగా అభ్యర్థుల విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆన్లైన్ ద్వారా నాలుగు విభాగాల్లో పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన వారికి నేరుగా సంస్థ నుంచి స్క్రైప్ ద్వారా ఆన్లైన్లో చివరి పరీక్ష, వీడియో కాలింగ్ ద్వారా మౌఖిక పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన మహిళా అభ్యర్థులకు బెంగళూరులో, పురుషులకు హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణలో.. సీ డ్యాప్ సంస్థ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆయా సంస్థ సిబ్బంది బెంగళూరు, ధర్మశాల ప్రాంతాలకు తీసుకెతారు. వీరికి ఏడాదిపాటు శిక్షణనిస్తారు. శిక్షణలో ప్రముఖ సంస్థలైన గుగూల్, టెక్ మహేంద్ర, ఆపిల్, ఐ ఫోన్ వంటి సంస్థలలో ట్రైనర్స్గా పనిచేస్తున్న వారు శిక్షణ ఇస్తారు. శిక్షణలో అభ్యర్థులకు సాఫ్ట్వేర్ సంస్థలో ఎలాంటి కోర్సులు ఉంటాయి.. వాటిని ఎలా నేర్చుకోవాల అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ఆంగ్లం, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుంది. ఏడాదిపాటు కొనసాగే శిక్షణలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఎంపికలు ఈనెల 15న జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని టీటీడీసీలో ఉదయం 10 గంటలకు నవ గురుకుల్ సంస్థలో కొలువుల కోసం ఎంపికలు జరుగుతాయి. ఎంపికకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఆధార్కార్డుతో హాజరు కావాలి. తుది ఎంపికలనంతరం 16న ఫైనల్ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల పాలిట వరం సీ డ్యాప్ సంస్థ ద్వారా నిరుద్యోగ అభ్యర్థికి సీటు లభిస్తే తన జీవితం బంగారు మయమే. శిక్షణానంతరం వారికి వివిధ రకాల సంస్థల్లో దేశంలో ఎక్కడైనా ఉపాధి లభిస్తుంది. కనీసం రూ.30 వేలకుపైగా జీతభత్యాలు ఉంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉపాధి కల్పించడం శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శివారెడ్డి, డీఏఆర్డీఏ ఇన్చార్జి పీడీ, కడప -
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..
రాజమహేంద్రవరం క్రైం : ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల వద్ద రూ.లక్షలలో సొమ్ము తీసుకొని మోసం చేసిన అంతర్ జిల్లా నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సలాది రాంజీ నాయుడు, అలియాస్ రామదాసు, అలియాస్ సుంకర రామకృష్ణ, అనే వివిధ నకిలీ పేర్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ పరిధిలో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాంజీ నాయుడు నకిలీ పేర్లుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో వందకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి వారి వద్ద లక్షల్లో నగదు తీసుకొని మోసం చేశాడని టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు తెలిపారు. -
గ్రంథాలయాల్లో మరిన్ని పోటీపరీక్షల పుస్తకాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయుక్తంగా మరిన్ని పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామ్మూర్తి అన్నారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో మంగళవారం పోలీస్ కానిస్టేబుల్స్ ఉచిత శిక్షణ తరగతులు ముగింపు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో పోటీ పరీక్షలకు యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు సుమారు 110 మందికి శిక్షణ పూర్తిచేశామని చెప్పారు. 50 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని ఏలూరు, లింగపాలెం తహసీల్దార్లు కేవీ చంద్రశేఖరరావు, బి.సోమశేఖర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సీహెచ్ మాదారు, కో–ఆర్డినేటర్లు డాక్టర్ గిరిబాబు, జె.రమేష్, ఎల్.వెంకటేశ్వరరావు, శిక్షణ ఉపాధ్యాయులు టి.విజయకుమార్ పాల్గొన్నారు. -
20న నిరుద్యోగులకు ఇంటర్య్వూలు
అమ్రాబాద్ : ఈ నెల 20న అచ్చంపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు విలేకరులతో తెలిపారు. ఉపాధి కల్పన కోసం వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు 10వతరగతి నుంచి డిగ్రీ చదివిన 18నుంచి 26 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
బాబు వచ్చాడు... జాబు ఏది???
-
జాబు లేదు.. భృతి లేదు
‘మేం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తాం’, ..‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వారి ఊసే పట్టించుకోలేదు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికి..వీధులపాలు చేశారు. చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన వేలాది మంది యువత సర్కారు వైఖరిపై రగిలిపోతున్నారు. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్న ఉపాధి కోల్పోయి పూటగడవని కుటుంబాలు ఆందోళనబాట పడుతున్నాయి. * జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 60 వేల మంది నిరుద్యోగులు * వాస్తవ సంఖ్య అంతకు నాలుగింతలు... * ఉన్న ఉపాధీ కోల్పోయి వీధిన పడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు * ఉపాధి కోసం యువత ఎదురుచూపులు * అమలు కాని సీఎం హామీలు * ఊసేలేని నిరుద్యోగ భృతి సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. జాబు రావాలంటే బాబు రావాలి అని ఎన్నికల ముందు ప్రకటనలతో హడావిడి చేశారు. చంద్రబాబునాయుడు కూడా ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీల వర్షం కురిపించారు. చంద్రబాబునాయుడి పాలన వచ్చి ఏడాది అయిన తర్వాత చూసుకుంటే కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు. జిల్లాలో సుమారు 1040 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బాబు నిర్ణయంతో రోడ్డున పడ్డారు. వచ్చీరావడంతోనే గ్రామాల్లో ఉన్న ఆదర్శ రైతులను తీసేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను తొలగించారు. అలాగే ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీలేవంటూ మిమ్మల్ని భరించలేమని అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5 వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు. వైద్యవిధాన పరిషత్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంక్షేమ హాస్టల్స్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులో పనిచేస్తున్న కుక్లు, ఇతర సిబ్బందిని టె ర్మినేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. స్కూల్స్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను తొలిగించి వారి స్థానంలో ఉన్న టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన జాబ్మేళాలకు వేలాది మంది నిరుద్యోగులు హాజరవుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలకు కూడా ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లు హాజరవుతున్నారంటే నిరుద్యోగ తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఫైళ్లు పట్టుకొని బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలాంటి మహానగరాలల్లోని కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. నిరుద్యోగులు 60 వేలేనట! జిల్లాలో నేటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 60 వేలమందికిపైగా నిరుద్యోగులున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకాలు సన్నగిల్లడంతో ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. వాస్తవానికి జిల్లా ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి కంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటారని అంచనా. గతంలో 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని విధిగా జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకునేవారు. ఇప్పుడు పూర్తిగా మానివేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, నియామకాలు జరుగుతాయన్న నమ్మకం లేదు. స్కూల్ అసిస్టెంట్లను ఎస్జీటీలోకి అనుమతించాలనే విషయమై తేల్చకుండా డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఈ విషయమై అభ్యర్థులు కోర్టుకెళతారన్న విషయం తెలిసి కూడా కావాలనే డీఎస్సీ పరీక్ష నిర్వహించారనే ప్రచారం ఉంది. నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మేనిఫెస్టోలో ఐదో వాగ్దానంగా టీడీపీ అధినేత చంద్రబాబు పొందుపరిచారు. జిల్లాలో అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా ఈ ఏడాది కాలానికి గాను రూ.144 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే సీఎం ఎత్తడం లేదు. బాబు వస్తే జాబు పోయింది నేను ఆదర్శ రైతును. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులందరినీ తొలగించారు. దీంతో ద్వారా మేము రోడ్డున పడ్డాం. అప్పుల పాలయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. - వెన్నపూస మాలకొండయ్య, పీసీపల్లి ఉన్న ఉద్యోగం తీసేశారు నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసేవాణ్ణి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన త ర్వాత ఉద్యోగం తీసేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దాదాపు ఏడుగురిని తొలగించారు. - బాబూరావు, చీరాల -
ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి తేవాలి
* విపక్షనేత జగన్కు నిరుద్యోగుల మొర * ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేసేలా చూడాలని వినతి సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీలోని ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటుగా వచ్చిన పలువురు నిరుద్యోగులు బుధవారం జగన్ నివాసంలో ఆయనను కలసి ఓ వినతిపత్రం సమర్పించారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వోద్యోగాల విషయంలో సంవత్సర క్యాలెండర్ను రూపొందించి అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంలేదని వారు ఆ వినతిపత్రంలో తెలిపారు. 2009లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గ్రూప్-1, 2, జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిందని, ఆయన మరణం తరువాత ఆలస్యంగా ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. నల్లారి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2012లో గ్రూప్-1,2 నోటిఫికేషన్లు జారీ అయినా గ్రూప్-2 పరీక్షలు మాత్రమే సజావుగా జరిగాయన్నారు. 2013లో మళ్లీ గ్రూప్-1, 2, జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని కిర ణ్కుమార్రెడ్డి ప్రకటించడంతో అనేకమంది నిరుద్యోగులు ఎంతో డబ్బు వెచ్చించి హైదరాబాద్లో పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ఫలితంగా తెలంగాణకు 1,10,000, ఏపీకి 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను కేటాయించారని, వీటిలో సుమారు 3,000 వరకూ గ్రూప్-1, 2 ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి ఉద్యోగార్థుల కోరికకు అనుగుణంగా నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, కానీ ఏపీలో మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. మార్చి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో తమ సమస్యలను లేవనెత్తి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని వారు జగన్ను కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగమేళా మాదిరిగా అధిక పోస్టులతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. జగన్ను కలసిన ఉద్యోగార్థుల్లో వి.మల్లయ్య, పి.రోజారాణి, ఎం.శ్రీనివాసరెడ్డి, పి.మునికుమార్, పిగిలి వాసు, ఎం.లక్ష్మిరెడ్డి, మణికంఠ, పి.ప్రసాద్, ఎస్.సద్దాంహుస్సేన్, పి.అజయ్కుమార్, కె.కొండలరావు, ఆర్.నాగార్జునరావు, కె.రాజయ్య ఉన్నారు. -
మా గతేంటి?
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎస్సీ- 2013 నోటిఫికేషన్ కథ కంచికి చేరేటట్లు కనిపిస్తోంది. విభజన సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విషయంలోనూ ఇదే విధమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా వేలాది రూపాయలు వెచ్చిస్తూ కోచింగ్ తీసుకుంటున్నామని, ఇప్పుడు నోటిఫికేషన్లు రాకపోతే తమ సంగతేంటని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆగస్టు మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. అయితే.. జూలై 30న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడంతో నోటిఫికేషన్ సంగతి మరుగునపడిపోయింది. జిల్లాలో డీఎస్సీ కోసం 1,002 ఉపాధ్యాయ పోస్టులను అధికారులు నోటిఫై చేశారు. వీటికి నోటిఫికేషన్ వస్తే సుమారు 25 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. కాగా.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సెప్టెంబర్లో జిల్లాలో దాదాపు 15 వేల మంది దరఖాస్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో టెట్ను నిరవధికంగా వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇప్పటికీ స్పష్టం చేయడంలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఏనాటికో? జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1,2,4తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో మూడు విడతలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్, వైద్యశాఖలోని పోస్టులను గుర్తించారు. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకిసన్నాహాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. దీంతో నోటిఫికేషన్లు జారీ చేయలేమని ఏపీపీఎస్సీ అధికారులు చేతులెత్తేశారు. అసలు ఇప్పట్లో నోటిఫికేషన్లు వస్తాయా? రాష్ట్ర విభజన తర్వాతేనా అన్న ప్రశ్నలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. గుర్తించిన మేరకు పోస్టులుంటాయా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. సంతోషం ఆవిరైపోయింది 2008లో డీఈడీ పూర్తి చేశా. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా. జూలైలో నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే ఎంతో సంతోషపడ్డా. అయితే... తెలంగాణ ప్రకటనతో నా సంతోషం ఆవిరైపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే కాకుండా.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. - డి.లక్ష్మినారాయణ, అనంతపురం ఎదురుచూస్తున్నా 2008లో డీఈడీ పూర్తి చేశా. 2012లో డీఎస్సీ రాశా. కొద్దిపాటిలో పోస్ట్ మిస్సయ్యింది. ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్ వస్తుందని తెలిసి.. వేలకు వేలు పెట్టి కోచింగ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు చూస్తే నోటిఫికేషన్ వస్తుందో, లేదో తెలియడం లేదు. - పి.చైతన్య, నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థిని, అనంతపురం