ముగిసిన జాతీయ టీటీ పోటీలు
పెద్దాపురం :
స్థానిక శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఏడో సీబీఎస్ఈ క్లస్టర్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం ముగిశాయి. సుమారు 40 సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు ఈ పోటీల్లో తలపడి అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో తమ ప్రతిభ కనపర్చారు. పాఠశాల డీన్ రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ప్రకాష్, రాష్ట్ర టీటీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పీవీఎన్ సూర్యారావ్ ప్రసంగించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ పోటీల విజయవంతానికి కృషి చేసిన కోచ్ అచ్యుత్కుమార్, పి.వేణుగోపాల్, 12 మంది అంపైర్లను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, అక్షర ప్రిన్సిపాల్ సునీత, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–14 బాలికల విభాగంలో విశాఖపట్నం లిటిల్ ఏంజిల్స్ స్కూల్, బాలుర విభాగంలో కాకినాడ అక్షర పాఠశాల విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఐశ్వర్య, బాలుర విభాగంలో మెరిడియన్కు చెందిన ఎస్ఎస్కే కార్తీక్ విజేతలుగా నిలిచారు.
అండర్–17 బాలికల విభాగంలో హైదరాబాద్ సికింద్రాబాద్ స్కూల్, బాలుర విభాగంలో భారతీయ విద్యాభవన్ (హైదరాబాద్) విజయం సాధించాయి. బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన లాస్య, బాలుర విభాగంలో ఎ.సాయి ధనుష్ (హైదరాబాద్) విజేతలుగా నిలిచారు.
అండర్–19 బాలికల విభాగంలో హైదరాబాద్ చెరిక్ పాఠశాల, బాలుర విభాగంలో ఓక్రైడ్జ్ ఇంటెల్ స్కూల్ (హైదరాబాద్) విజయం సా«ధించాయి. సింగిల్స్ బాలికల విభాగంలో పాక్జె షాహా (హైదరాబాద్), బాలుర విభాగంలో బి.ఆదిత్య రెడ్డి (విజయవాడ) విజేతలుగా నిలిచారు.