breaking news
TS PSC
-
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
-
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులే ఆన్లైన్లో మాక్ టెస్టు ద్వారా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేక లింకును ఇచ్చింది. మంగళవారమే ఈ లింకును అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష సమయంలో ఇబ్బందులు పడకుండా, ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్ టెస్టులో కూడా అవన్నీ ఉంటాయని తెలిపారు. పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి.. బహుళ ఐశ్చిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలి.. అన్న నిబంధనలు ఇందులో ఉంటాయని వివరించారు. ఇందులో ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే అభ్యర్థులు హాల్టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, తద్వారా పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పరీక్ష మొత్తం ఇంగ్లిషు మీడియంలోనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం పరీక్ష కోసం అభ్యర్థులు 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా ఉండాలని తెలిపారు. -
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష!
⇒ పారదర్శకత కోసం టీఎస్ పీఎస్సీ యత్నం ⇒ అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తున్న సీఎం కార్యాలయం సాక్షి ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న దాదాపు 2 వేల వరకు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానం అమలుపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏఈ, ఏఈఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే అవకాశం ఉన్నందున ఆన్లైన్ పరీక్ష విధానం ప్రవేశ పెడితే బాగుంటుందన్న యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివిధ పోటీ పరీక్షల నిర్వహణ విధానాలపై ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పరీక్ష విధానాలపై అధ్యయనం చేసిన టీఎస్ పీఎస్సీ.. ఐఐటీ వంటి పరీక్షల్లో అనుసరిస్తున్న ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అధ్యయనం చేసింది. దీంతో ఆన్లైన్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే బాగుంటుందని, పారదర్శకతతో పాటు అభ్యర్థికి త్వరగా ఫలితాలు ఇవ్వడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఒకవేళ ఆన్లైన్ విధానం అమలు సాధ్యం కాకపోతే రాత పరీక్షల (ఆఫ్లైన్)ను నిర్వహించే వీలుంది. మరోవైపు ఇతర పరీక్షలతో పాటు, డిస్క్రిప్టివ్ విధానం ఉండే పోటీ పరీక్షల్లో మాత్రం ఆన్లైన్ విధానం కాకుండా రాత పరీక్ష విధానాన్నే అనుసరించనుంది. వారం రోజుల్లో అనుమతులు.. పోటీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు రావాల్సి ఉంది. మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటనతో అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం (సెల్) ఇప్పటికే శాఖల నుంచి ఖాళీల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించే పనిలో పడింది. మరోవైపు అనుమతులపై కూడా దృష్టి పెట్టింది. పోటీ పరీక్షల విధానం (స్కీం), పోటీ పరీక్షల్లో పెట్టాల్సిన సిలబస్, 371(డి) కొనసాగింపు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తుందా? కొత్త రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెడుతుందా? అన్న విషయంలో స్పష్టత, గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు పెంపు వంటి అంశాలపై ఉత్తర్వులు అన్నీ వారం రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వెనువెంటనే నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్సీ ద్వారా జారీ చేయించే అవకాశం ఉంది. వన్ టైం రిజిస్ట్రేషన్కు భారీ స్పందన... టీఎస్ పీఎస్సీ ప్రవేశపెట్టిన వన్ టైం రిజిస్ట్రేషన్కు భారీ స్పందన లభిస్తోంది. మే చివరి నాటికి 80 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన మంగళవారం నాడు అనేక మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ల సమాచారం ఎస్ఎంఎస్ల్లో అభ్యర్థి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతని విద్యార్హతలను బట్టి ఫలానా నోటిఫికేషన్ జారీ అయిందన్న సమాచారం అభ్యర్థికి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ ద్వారా కూడా ఈ సమాచారం వస్తుంది. దీంతో అభ్యర్థి పరీక్ష ఫీజు చెల్లిస్తే చాలు. మళ్లీ మళ్లీ దరఖాస్తు ఫారాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు.